Friday, May 17, 2024

BAHIRDASAARA CHAKRAMU-PARICHAYAMU

 


 పరమేశ్వరి అనుగ్రహముగా మనము సర్వసౌభాగ్యదాయకచక్రమును దాటి"సర్వార్థసాధకచక్రము/బహిర్దశారము అను పదికోణములు వెలుపలగా గల ఆవరణములోనికి ప్రవేశించుచున్నాము.


 " శక్తిః  ఎకాం దశస్థానే స్థిత్వా సూతై జగత్రయం

   విశ్వ యోనిః ఇతి ఖ్యాతాఃసా విష్ణుః దశరూపకం"


  ఇదే విషయమును లలితా రహస్య సహస్రనామ స్తోత్రము,

 "కరాంగుళి నఖోత్పన్నా నారాయన దశాకృతిః" అని స్తుతించింది.


    వైష్ణవీ శక్తి ఒక్క స్థానములో స్థిరముగానుండిపది స్థానములలో విభిన్నముగా ఏర్పడి"కులయోగినులు"గా సహాయపడుతూ,"త్రిపురాశ్రీ" అను చక్రేశ్వరి ఆశీర్వచనముతో,ధర్మార్థ కామమోక్ష ప్రదాయకముగా కీర్తింపబడుచున్నది.

 నాల్గవ చక్రమైన సర్వ సౌభాగ్యదాయక చక్రము నాడీమండలముగా నున్న చేతనాశక్తిని సాధకునికి వివరిస్తే,సర్వార్థసాధక చక్రము నాడులలో ప్రాణనాడి యైన 'సుషుమ్న" నాడి ప్రాధాన్యమును,దానిలోనిచేతనత్వమును కులయోగినుల ద్వారా సాధకునికి  పరిచయము చేస్తుంది.

  స్మృతి షట్చక్రములకూటమిని"కులముగా" వివరిస్తే,ఖడ్గమాల స్తోత్రము మన శరీరములో అంతర్లీనముగా నున్న సుషుమ్నను కులముగా,దాని వివిధ శక్తులను కులయోగినులుగా కీర్తిస్తుంది.

 "కౌళ మార్గము"అకులమును శివతత్త్వముగాను-కులమును శక్తి తత్త్వముగాను సంభావిస్తుంది.

 జ్ఞానేంద్రియ+కర్మేంద్రియముల కూటమి యైన దేహమునుకూడా కులమని వ్యవహరిస్తారు.

 పదానములు/ప్రదాయకములు కులయోగినులు.వీరు సర్వత్రా,

1.సిద్ధిగా

2.సంపదగా

3.ప్రియకరిగా

4.మంగళకారిణిగా

5.కామిత ప్రదాయినిగా

6.దుఃఖవిమోచినిగా

7.మృత్యుప్రశమనిగా

8.విగ్న నివారిణిగా

9.సర్వాంగ సుందరిగా

10.సౌభాగ్యదాయముగా

 అధిష్ఠించి ఆశీర్వదిస్తుంటాయి.


Monday, May 13, 2024

SARVA SAUBHAAGYADAAYAKA CHAKRAMU-PARICHAYAMU


 


 " హ్రీంకారస్తు మహామాయా భువనాని చతుర్దశా

   పాలయంతు ఫలా తస్మాత్ చక్రకోణంప్రవేశ్మితే"


 పదునాలుగు చక్రకోణములుగా ప్రకటింపబడుతూ,పదునాలుగు భువన భాందములను పరిపాలిస్తున్న పరమేశ్వరికి ప్రణామములు.


  పరాత్వరి అనుగ్రహముతో మనము ,

 1.త్రైలోక్య మోహన చక్రము

 2.సర్వాశా పరిపూరక చక్రము

 3.సర్వ సంక్షోభణ చక్రము నందు అధిష్ఠించి,అనుగ్రహిస్తున్న 


 1.ప్రకటయోగినిలు

 2.గుప్త యోగినులు

 3.గుప్త తర యోగినుల సహాయముతో


   నాల్గవ చక్రమైన

4.చతుర్దశారము/పదునాలుగు త్రికోణములున్న చక్రము లోనికి ప్రవేశిస్తున్నాము.

   మూడు ఆవరనములో నున్నప్పుడు సాధకుడు,

 నేను వేరు-పరాత్పరి వేరు అన్న ద్వంద్వ భావములుకలవాడై,

 అమ్మను ప్రార్థిస్తే సంతసించి,నా ఎదుట ప్రత్యక్షమై నన్ను అనుగ్రహిస్తుంది అన్న వస్తు భావన మిళితమైన వాస్తవములో ఉంటాడు.

 ఆ భావనకు అనుగుణముగానే మొదటి చక్రమైన భూపురము చతురస్రాకార (ఊహా)మూడు రేఖలు,పదహారుదళముల పద్మము,అష్టదళ పద్మము సాధనా ప్రారంభమునకు వీలుగా,అత్మ తత్త్వ విచారణకు అనుగుణముగా వికసిస్తున్న జ్ఞాన రేకులతో సాధకుని బిందువు చేరుటకు అనుగుణముగా సిద్ధముచేస్తున్నది ఆ

"అంతర్ముఖ సమారాధ్యా-బహిర్ముఖ సుదుర్లభా" 

  సూక్ష్మ తత్త్వ గమన సంకేతమే త్రికోణముగా నాల్గవ ఆవరణము మనలోని చేతనాశక్తిని పరిచయము చేస్తుంది.


 హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతర దీపికా" అనికీర్తిస్తున్నది లలితా సహస్ర రహస్య నామములో.

 అనాహత చక్రములో ప్రభాపూరితమై,శబ్ద బ్రహ్మాత్మికమైన చిత్శక్తి,

 సంప్రదాయ యోగినులు అను శక్తుల రూపముగా,పదునాలుగు ముఖ్య నాడులుగా విరాజిల్లుతూ ఉపాధిని/చేతనునిశక్తి వంతముచేస్తున్నది.


    మరొకవిషయము సాధకుడు ఈ ఆవరనములోనే,

 స్వయంభూలింగమును చుట్టుకుని యున్న కుండలినీ శక్తితో కూడిన "సుషుమ్నా" నాడి గురించి తెలుసుకుంటాడు.


  మరొక భావనను తెలుసుకోవాలంటే,

1.మనసు

2.బుద్ధి

3.చిత్తము

4.అహంకారములతో కూడిన

10 ఇంద్రియ సమ్మేళనమే

 చతుర్దశారచక్రము.

  ఈ ఆవరనములోని యోగినులు

1.సర్వ సంక్షోభిణి

2.సర్వ విద్రావిణి

3.సర్వాకర్షిణి

4.సర్వ ఆహ్లాదిని

5.సర్వ సమ్మోహిని

6.సర్వ స్తమ్ణిని

7.సర్వజృంభిణి

8.సర్వ వశంకరి

9.సర్వ రంజని

10. సర్వ ఉన్మాదిని

11.సర్వార్థ సాధిని

12.సర్వ సంపత్తి పూర్ణి

13.సర్వ మంత్రమయి

14.సర్వ ద్వంద్వ క్షయంకరీ.

   పరమేశ్వరి,

 మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి,దీని నీవార సూక పరిమానములో ప్రాణశక్తిగా ప్రకాశ్మొదలగు స్తున్నది తల్లి అని కీర్తిస్తున్నది "మంత్ర పుష్పము"

 సుషుమ్నా నాడి ప్రాణ వాయువు.ఈ నాడి "సర్వ ద్వంద్వ క్షయంకరీ."సంపత్తిపూరిణి అను ఇడా నాడిని,సర్వ మంత్ర మయీదేవి అను "పింగళ" నాదిని కలిగియుంటుంది.నిరంతర రక్త ప్రసరనమును(శుద్ధిచేస్తూ) జరుపుతుంటుంది.

 ఈ నాడీ మండలము మనలను ,మన మెదడును,మనైంద్రియములను నిరతరముచైతన్య వంతముచేస్తున్నదన్న విషయమును సాధకుడు గ్రహించగలుట ప్రారంభిస్తాడు.మనలోని వాక్కు పయనము,ఇంద్రియ నిబద్ధత గ్రహించటం ప్రారంభము అవుతున్నట్లుగా,కాలప్రవాహము,చైతన్య ప్రావహము తో పాటుగా జ్ఞాన ప్రవాహమును గుర్తించటమ్మొదలుపెడతాడు.

 అంటే  తాను అనుకునే దేహము తాను కాదని,దానిలో దాగి చైతన్యమును కలిగించుచున్న ఆత్మయే తాను అని గ్రహించుట ప్రారంభం అవుతుంది.

 ఆ అభేద జ్ఞానమె సౌభాగ్యము.అదియే సర్వము నిండియున్నదని తెలిసికొనుటయే సర్వ సౌభాగ్య దాయకము.

 అంటే పరమేశ్వరి సాధకుని "జడ స్థి నుండి-చైతన్యస్థికి" మారుస్తుంది.

 తనలోని కదలికలు శ్వాస తీసుకొనుట,జీర్ణ వ్యవస్థ మొదలగునవి కేవలము ఉపాధికి మాత్రమే కాని ఆత్మ కు కావు అన్న సత్యము అనుభవము లోనికి వస్తుంటుంది.

  సంప్రదాయ యోగినుల సహకారముతో చక్రేశ్వరి త్రిపురవాసిని ఆశీర్వాదముతో సాధకుడు ఐదవ ఆవరనము అయిన "బహిర్దశార చక్ర" ప్రవేశమునకు అర్హుడై,సన్నద్ధుడవుతున్నాడు.

  " యాదేవి సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా

    నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.



Saturday, May 11, 2024

SARVA SAmKSHOBHANA CHAKRAMU-PARICHAYAMU


 


  "అష్టదళ కమలమందు నిష్ఠతో నీ ప్రతిమ నిలిపి

   సృష్టికర్తవనువనుచు తెలిసి ఇష్తముగ సేవించుచుంటి

     ఈశ్వరి నీకిదిగోమంగళం

     త్రిపురంతకవాసిని దేవి నీకిదిగో మంగలం"

 

 పరమేశ్వరి దయతో మనము అష్టదళ విలసితమైన సర్వసంక్షోభణ చక్రములోనికి ప్రవేశించుచున్నాము.ఇక్కడానంగశక్తులు గుప్తతర యోగినులుగా త్రిపురసుందరి సమేతులై విరాజిల్లుచున్నారు.

 అమ్మవారిని లక్ష్మీ స్వరూపముగాకీర్తించేటప్పుడు,

 అనంగ పాయనీ/అనంగపారగావీక్షణ శబ్దములు వింటుంటాము.

  అనంగా అను శబ్దమునకు అవిభాజ్యము/అఖందము/అనంతము/అవిఛ్చిన్నము/ఆది-మధ్య-అంతరహితము అన్న భావముతో సమన్వయిస్తారు.

 మనము ఇంతకుముందు "సర్వాశాపరిపూరక చక్రములో" కామాకర్షిణి మొదలగు గుప్తయోగినుల అనుగ్రహమును తెలుసుకున్నాము.

 సామాన్యముగా ఆకర్షణ అనునది ఒక వస్తువుపైనగాని/ఒకమనిషిపైన కాని/ఒకప్రాంతమునందు గాని/ఒక సంఘటనమునందుగాని నిలిచి,కాలక్రమేణ తగ్గుతుంటుంది.అది ప్రాపంచిక విషయసంబంధమైతే పరిణితి చెందక ఉంటుండి.

 కాని "సర్వసంక్షోభణ చక్రము"నందలి గుప్తతర యోగినులు అనంగులు.అపరిమిత శక్తి సంపన్నులు.వారి అనుగ్రహము సైతము గుప్తతరమే.

 వారే,

 కుసుమా

 మేఖలా

 మదనా

 మదనాతురా

 రేఖా

 వేగిని

 అంకుశా

 మాలిని, అను

 ప్రవృత్తి-నివృత్తి-ఉపేక్ష అను మూడు స్వభావములతో నున్న పంచ కర్మేంద్రియ ధర్మాలు.

 మొదటి యొగిని కుసుమ మానస వికాసమునకు అణిమ,బ్రాహ్మీ,కామాకర్షిణి సహాయపడుతున్నారో సాధకుని సత్సంకల్ప వికసనమునకు సహాయపడుతుంది.పరాత్పరి యొక్క  ప్రాభవమును ఆలోచించు చేతనత్వమును  అనుగ్రహిస్తుంది.మేఖలా శక్తి వృత్తాకార స్వభావముతో వికసించుచున్న శక్తి చైతన్యమును జారిపోకుండా కాపాడుతుంటుంది.మణిపూరక చక్ర స్థానమైన నాభిప్రదేశములో సాధకునితో అవిభాజ్యమైన సంబంధమును కలిగియుండి పరాత్పరి వేరు-నేను వేరు అన్న ద్వంద్వభావనలతో నున్న సాధకునికి మదనే యోగిని నిర్ద్వంద్వ భావమును కలిగిస్తుంటుంది.ఆ భావనలకు ప్రోద్బలముగా మదనాతురే యోగిని ఉన్మత్త స్థితికి,ఉన్నది ఒక్కటే రెండుగా కనిపిస్తున్నవన్నె ఒక్కదాని ఆభాస యే అన్న భావనను కలిగిస్తుంటుంది.పదే పదే పరాత్పరి తలంపుతో పరవళ్ళు తొక్కునట్లుగా చేస్తుంది.అనంగ రేఖే సోదాహరణముగా సత్చిత్ రూపమును అనుభవములోనికి తెస్తుంది.ఉదాహరనకు మనము అద్దములో మనముఖమును చూసుకొనునప్పుడు మనముఖ ప్రతిబింబము కనిపిస్తుంది.అదే అద్దము పగిలిపోతే మన ముఖముంటుందికాని ప్రతిబింబముండదు.పోనీ మనము మన ముఖమును పక్కకు జరిపినా మన ప్రతిబింబము అద్దములో కనిపించది.అంటే మనము చూసే మన ప్రతిబింబము ఆభాస.ద్వంద్వము నివృత్తి అయి నిర్ద్వంద్వము ప్రవృత్తిగా మారు వేళ తటస్థభావము రాకుండా అనంగవేగిని గుర్తుచేస్తుంటుంది.అయినప్పటికి గ్రహించలేని ఎడల అనంగాంకుశిని హెచ్చరించి,సర్వ ద్వంద్వ క్షయంకరీ అయిన త్రిపుర సుందరి చక్రేశ్వరినిచర్చి,

 చతుర్దశార చక్ర ప్రవేశతకు అర్హతను కల్పిస్తుంది.

 ఈ మూడు ఆవరనములు భౌతిక పరిణామములకు,జ్ఞాన వికసనమునకు సంబంధించినవి.సాధకుడు ద్వంద్వములోనే ఉంటూ నిర్ద్వంద్వమును కనుగొనే ప్రయత్నములో ఉంటాడు.

  కనుక ఇకపై చక్రములు త్రికోణాకారములో కుశాగ్రబుద్ధి సంకేతముగా ఉంటాయి.


 యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా

 నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.



Thursday, May 9, 2024

SARVASAPARIPURAKA CHAKRAMU-PARICHAYAMU

 


  పరమేశ్వరి అనుగ్రహముతో మనము రెండవ ఆవరనమైన "సర్వాశా పరిపూరక చక్రము"లోనికి ప్రవేశించుచున్నాము.ఇక్కడ"త్రిపురేశి" చక్రేశ్వరి.పదహారు తిథినిత్యా దేవతల 'షోడశదల కమలము" గుప్తయోగినులతో,


 "ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా

  శ్రీ- షోదశ అక్షరీ విద్యా త్రుకూట కామకోటికా" గా విరాజమానమై యుంటుంది.

 పరమేశ్వరినిరుపప్లవ-అనగా వృద్ధి/క్షయములు లేని మోక్షస్వరూపము.అట్టి తల్లి మనలను అనుగ్రహించుతకై వృద్ధి/క్షయ స్వభావితములైన తిథినిత్యదేవతలతో విరాజమానమై మనలను అనుగ్రహించుచున్నది.

  ఇది ఒక సంభావనమైతే.మరొక విధానములో 16 షోడశ ఉపచారములు-షోడశ సంస్కారములు-షోడశ అక్షరములు తానైనది షోదసదళాస్థిత యైనజగన్మాత.

  అమ్మ అష్టమీచంద్ర విభ్రాజ-

 ఏ మార్పులు లేని త్వరిత కళను శిరోభూషనముగా ధరించిప్రకాశించునది.

 ఈ త్వరిత కళ ఎటువంటి మార్పులు లేని "నిర్గుణ తత్త్వమునకు"ప్రతీకగా ప్రకాశిస్తుంటుంది.

 గుణములు ఉపాధిని ఆశ్రయించి ఉండునుకాని ఆత్మను చేరలేవు.


  షోడశ దళ పద్మములోని పదహారు రేకులను పంచభూతములు+పంచేంద్రియములు జ్ఞాన+పంచేంద్రియములు కర్మకు+ మనసుకు అన్వయిస్తారు.

 ఇవి అంతర్ముఖమునకుసహాయపడే గుప్త శక్తులు.

  అమ్మ మనోరూపేక్షు కోదండా-పంచతన్మాత్ర సాయకా.అమ్మ చెరుకు విల్లు నిజతత్త్వమనే మధువును అందించే విల్లును చేత ధరించి,పంచ తన్మాత్రలనే బానములతో మనలను ఉద్ధరించుటకు సిద్ధముగా ఉన్నది.

 కాని మనము బాహ్యమునుచూసిపరవశిస్తూ,దేహమేనేను అనేభ్రాంతితో,కోరికలవైపు,విద్యలవైపు,శబ్దమువైపు,రుచులవైపు,వాసనలవైపు,రూపముల వైపు,నామముల వైపు మన్మథ బానములచే ప్రభావితులమై మైమరచిపోతుంటాము.అదియును అమ్మ అల్లుచున్న మాయాను అవనికయే.తెరచాటున ఉన్న తేజోమూర్తిని గుర్తించలేని అహంకారమే.అజ్ఞానమే.

 ప్రథ్వీ తత్త్వమైన మూలాధారములోని వస్తుప్రపంచమను సత్యమన్న భ్రాంతిలో నున్న సాధకుని మనసును పరమేశ్వరి ఈ గుప్త యోగినుల అనుగ్రహము ద్వరా భ్రమలను తొలగించి తన వైపునకు ఆకర్షించుకుంటుంది.

 అపారమైన అనుగ్రహము ఆకర్షించిన వేళ కామేశ్వర-కామేశ్వరియే కామదాయిని అని గ్రహించగలుగుతాడు.అనాహత శబ్ద నాదమే ,అజపా మంత్రమే ఆనందానుభూతిని అందించగలుగుతుంది.అన్ని రూపములే అమ్మ రూపములే అన్న సత్యము బోధపడుతున్నది.ఆనిపరిమళములు అమ్మ కరుణయే.అన్ని భోగములే అమ్మానురాగములే.అని తెలుసుకొనుచున్న సాధకుడు,

 పంచభూతములు+పంచజ్ఞాన+కర్మేంద్రియములు+మనసు అమ్మ భావనతో/ప్రాణ సక్తితో అనుసంధానమైన వేళ,

 తన యొక్క మనసు,ఇంద్రియములు,ధాతువులు,బాహ్యము నుండి అంతర్ముఖము చెందుతు,శుద్ధిచెందుట వలన,అమ్మ-నేను అన్న ద్వంద్వ భావములున్నప్పటికిని,రజోగుణరహితమైన తేజోమూర్తిగా మారుతూ,త్రిపురేశి ఆశీర్వాదముతో,మూడవ ఆవరనములోనికి,వికసిత మనస్కుదై ప్రవేశార్హుడగుచున్నాడు.

  యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థితా

  నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.


Wednesday, May 8, 2024

TRILOKAMOHANACHAKRAMU-PARICHAYAMU-03




   అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా
     అని శ్లాఘిస్తున్నది పరమేశ్వరిని లలితారహస్య సహస్రనామ స్తోత్రము.
  న-ఇతి,ఇది కాదు ఇదికాదు అంటూ ముందుగా చిత్శక్తి ని గుర్తించే విధానములో కానిదానిని గుర్తించి,తొలగించుకొనమని "కేనోపనిషత్తు"చెబుతోంది.

  " శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా
    శ్రీ గిరినిలయా నిరామయా సర్వమంగళా"

  ఈ మానవ ఉపాధి ఎంత విచిత్రమైనది." ఆహార నిద్రా భయ మైథునశ్చాఅన్న నాలుగు అవసరములను తీర్చుకుంటూ,తన మనసును ఇంద్రియభోగములపై కేంద్రీకరించి,తన అవసరములు ఏ విధముగా తీరుతున్నాయి? ఎవరు తీరుస్తున్నారు? బాహ్యములో కనపడుతూనా/లేక అంతః ముఖముగానుండి  అనే ఆలోచన రానీయకుండా ఆజగజ్జనని మాయ తెరలను కప్పుతూనే ఉంటుంది.అంతలోనే దయాంతరంగయైవాటిని విప్పుతుంటుంది.
  ఆ ప్రక్రియలో మనకు సులభముగా అర్థమగుటకై ఎన్నోరూపములను ధరించి,ఎన్నెన్నో స్వభావములతో,సహాయకారిగా 
  ఆశివప్రకాసమైన శివాని సర్వాభీష్ట సిద్ధికై,సర్వ మంగళకారిణిగా,ప్రకృతిగా/ప్రపంచముగా  తనను తాను ప్రకటించుకుని,
 "ఆహో పూరిషికగా" ఆవిర్భావము చెంది వాటన్నింటికి మూలముగా/ఆధారముగా అలరారుచున్నది.
 ఆ జగజ్జనని "మహా లావణ్య శేవథిః" తన స్వరూపమునకు/తన సౌందర్యమునకు తానే సరిహద్దులను ప్రకటిస్తుంటుంది.
ఆ విధముగా పంచభూతాత్మికమైన పృథ్వీ తత్త్వముగా,బిందువు విస్తరించి "త్రైలోక్యమోహన చక్రముగా/భూపురముగా" సాధకునికి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికిచేర్చుటకు సహాయపడుచున్నది.
 తన అంశలను మూడు చతురత్స్రాకారములలోను,అష్టసిద్ధులుగాను,సప్తమాతృకలుగను,ముద్రాశక్తులను అధిష్టింపచేసి,తాను వారినిక్కూడి "ప్రకట యొగిని" స్వరూపముగా చక్రేశ్వరి యైన "త్రిపుర"తో విరాజమానమైనది
  ఈ ఆవరణము పృథ్వీ తత్త్వప్రతీక.మూలాధారైక నిలయగా తల్లి చర్మ చక్షువులు గమనించగలుగు ప్రకట సిద్ధులతో,మహాలక్ష్మి సమేత సప్తమాతృకలతో,స్పందన/చైతన్యవంతమైన ముద్రాశక్తులతో,సాధకుని స్వస్వరూప దర్శన దిశానిర్దేశమునకు సహాయపడుతుంది.
 త్రైలోక్యమోహన చక్రములో నున్న సాధకుడు ద్వైత ప్రకృతిలోనే ఉంటాడు.తనౌపాధి-తన ఎదురుగా నున్న శక్తి,ఆ శక్తి అనుగ్రహముతో సాధన పురోగమనము చేయగలుగుతాడు.
  ఇది సాధకుడు తనలోని "అంతర్యామిని" అర్థము చేసుకునే అన్వేషణము యొక్క ప్రారంభదస్శ.ఎన్నో ఆకర్షణలు/ప్రలోభములు అడ్డుకుంటూనే ఉంటాయి.ఇంద్రియాలు చెప్పిన మాటవినమని మొరాయిస్తుంటాయి.
 అట్టి స్థితిలోనున్న సాధకునికి తమ శక్తి ద్వారా వస్తు ప్రపంచము శాశ్వతము కాదని,దానిమీది వ్యామోహము తగ్గకున్న సాధన దుర్లభమని తెలియచేస్తాయి.
ఉదాహరనమునకు,
 అణిమా సిద్ధి చిన్నపరిమాణముగా మారుట,చేతనులు తమకు తాము విషయవాసనలను తగ్గించుకుని సిద్ధము అయితే కాని ,బ్రహ్మీ స్థితిని పొందలేమని సత్యమును గ్రహించమంటుంది.అణిమ+ బ్రాహ్మీ సాధకుని స్పందన శక్తియైన/చైతన్య శక్తి యైన సర్వ సంక్షోభిణి శక్తికి పరిచయము చేసి,పంచేంద్రియ+పంచభూత సమన్వయ కర్తయై యోగసిద్ధికి సహాయపడుతుంది.
 శుక్ల-పీత-అరుణ వర్ణితమైన భూపురము త్రిపుర చక్రేశ్వరి అనుగ్రహముతో  సాధకుడు రెండవ ఆవరణమైన "సర్వాశాపరిపూరక చక్ర"ప్రవేశార్హతను కలుగచేస్తుంది.
   దేవీతత్త్వమును పరిపూర్ణముగా  ఆకళింపుచేసికొనిన మహనీయులు,
 అష్టసిద్ధుల విస్తార శక్తులే మహాలక్ష్మి సమేత సప్తమాతృకా శక్తులుగా,వాటి సహకరణ శక్తులేముద్రాశక్తులుగా  ఆరాధిస్తారు.
 ప్రకట యోగినుల సహాయ సహకారముల వలననే సాధకుడు రెండవ ఆవరణప్రవేశార్హతను పొంది సాధనను కొనసాగించ కలుగుతాడు.
  యాదేవి  సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
  నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.

   

 

Monday, April 29, 2024

TRILOKAMOHANACHAKRA PARICHAYAMU-02


  

1-

   అమ్మ అనుగ్రహముతో,సిద్ధిదేవతల సహకారముతో,త్రిపురా అనుగ్రహముతో సాధకుడు రెండవ చతురస్త్రాకారములోనికి ప్రవేశించగలుగుతున్నాడు.అష్టసిద్ధులు సాధకునిలోని కొంతవరకు సహాయపడి మరింతసహాయపడు "సప్తమాతృకలకు" అదియును మహాలక్ష్మి సహిత సప్తమాతృకలు పరిచయము చేస్తున్నారు.

 కొందరి భావన ప్రకారము అష్టదిక్కులే అష్టమాతృకలుగా ఆరాధిస్తారు.

 స్థూలలో అష్టదిక్కులు వీరైతే సూక్ష్మములో/మన మనస్సులో చెలరేగే అరిషడ్వర్గములు+పాపపుణ్యములుగాను పరిగణిస్తారు.

 అమ్మతన రూపురేఖలే వీరికి ప్రసాదించినప్పటికిని ,అమ్మ అజ్ఞానుసారముగా వీరు ప్రవర్తిస్తుంటారు.

 చండీసప్శతి శివుని స్వేదము నుండి ఈ ఏడుగురు తల్లులు ఉద్భవించాయని యుద్ధభూమిలో అసురసంహారము చేసి తరించారనికూడా చెబుతారు.

నిశితముగాధ్యానించినమహాయోగులు అష్టసిద్ధుల పరమార్థమే సప్తమాతృక రూపమున సాధకునికి మరింత సహాయపడతారని విశ్వసిస్తారు.

1.బ్రాహ్మీ

2.మహేశి

3.కౌమారి

4.వైష్ణవి

5.వారాహి

6.మాహేంద్రి

7.చాముండా

    మహాలక్ష్మి,

 యుద్ధభూమిలో పరమేశ్వరి అనుగ్రహముతో సహాయకములుగామారి ధన్యతనొందినవైనప్పటికిని,

 ప్రతిమనిషి/ఉపాధి అంతరంగము మంచి-చెడుల యుద్ధభూమిగా అనుకుంటే వాటిలోని చెడును నిర్మొలించుటకు,

1.బ్రహ్మీ శక్తి

   జీవునకు అనేక సత్సంకల్పములను కలిగించుచున్నది.సృష్టి సర్వము బ్రహ్మీశక్తియే.ఆ తల్లి దృశ్యమాన జగతి అశాశ్వతమును సాధకునకు తెలియచేసి,బ్రహ్మానంస్థికి మార్గము చూపుతుంది.

2.మాహేశ్వరి శక్తి

 సంహారిణీ రుద్రరూపా అనికీర్తిస్తుంది లలితా సహస్రనామ స్తోత్రము.

 తల్లి రుద్ర రూపముతో సంహరించేది అజ్ఞానమనే చీకటిని.తల్లిధర్మ స్వరూపిణి.ధర్మమునాశ్రయించిన జ్ఞానమే సత్వగుణ ప్రకాశము.మాయను అల్లునదిమహేశ్వరి దానినితొలగించునదియును మహేశ్వరియే.

3.కౌమారి/కుమారి

కు అనగా దుర్మార్గం.దానిని పూర్తిగా తొలగించునది కౌమారి.యుద్ధభూమిలోశక్తిసేనా నాయకియై అసురత్వమును అంతమొందించినది.

 సాధకుని ఇంద్రియ గతి వక్రముగాకుండా నియంత్రించునది కౌమారిమాత.

4.వైష్ణవి/గరుడవాహిని.

  గరుత్మంతుని/సుపర్ణునీధిష్టించునది.

 సు అనగా మంచివైపునకు మార్గముచూపు పర్ణములు రెక్కలు.

కర్మ-జ్ఞానము అనురెండు మంచి ఆలోచన-ఆచరణ  అను రెండు రెక్కల సహాయముతో,దేహమే ఆత్మ అను భావమును తొలగించిద్వంద్వములనువిడిడిగా చూపు శక్తి.

5 వారాహి

 కల్పపరిమితమైన  కాలమునకు సంకేతముగా  వారాహి శబ్దము ,శ్రేష్టమైన ఆత్మ ను తెలియచేయు వర శబ్ద ప్రాధాన్యముగాను వారాహి మాత కొలువబడుచున్నది.ఈ చైతన్యసక్తిని ఆధారముచేసుకుని సర్వము/సకలము సంభవించుచున్నది.

6.మహేంద్రి 

 "ఈర్" ధాతువునకు గతి/నడక అని అర్థము.

 వారాహి శక్తీంద్రియగమనమునుతెలియచేస్తుంటే/

మాహేంద్రి ఇంద్రియ గమనమును నియంత్రిస్తూ సాధకునికి మనసు చలించకుండాసహకరిస్తుంటుంది.

7.చముండా/చండ-ముండ

  కథనములో రాక్షసులు.వారిని సంహరించిన శక్తి.

మనమనసులోనీఅలోచనలప్రవృతియే చండ-నివృతియే ముండ.ఆలోచనలను నియంత్రించే అద్భుత శక్తియే చాముండా.

8.మహాలక్ష్మి/మూలస్వరూపము.

 శుభప్రదాయిని  మహల  అను అసురుని మర్దించినది.

 ఈ ఆవరనములోని మాతృకానుగ్రహముతో సాధకుడు,తనయొక్క సప్తధాతువులు-మనసు శుద్ధిచెందుటచే పాపరహితుడై,రజోగుణ విహీనమైన ప్రకాసమును పొంది,చక్రేశ్వరి అయిన త్రిపురేశి కి నమస్కరించి,మూడవ చతురస్త్రాకారములోనిప్రవేశించి,ముద్రాశక్తులానుగ్రహమును పొందగలుగుతాడు.


   శ్రీ మాత్రే నమః.



Saturday, April 27, 2024

TRILOKAMOHANCHAKRPARICHAYAMU --01


 

" కదంబవన మధ్యగాం కనకమండలోపస్థితాం

   షడంబురుహవాసినీం సతతసిద్ధ సౌదామినీం

   విడంబిత జపరుచిం వికచ చంద్రచూడామణిం

   త్రిలోచన కుటుంబినీం త్రిపురసుందరీం ఆశ్రయే"


 "విశృంఖలా వివక్తస్థా వీరమాతా వియత్ప్రసుః"

  అని పరమేశ్వరిని ప్రస్తుతిస్తుంది లలితరహస్యసహస్రనామ స్తోత్రము.


  శృంఖలములు /సంకెలలోబంధింపబడియున్నదెవరు.పరమేశ్వరి వాటిని తన అనుగ్రహముతో ఎలా తొలగిస్తున్నది అన్న అవ్యాజకరుణయే దేవీఖద్గమాలా స్తోత్రములోని నవావరణ ప్రాధాన్యము.

 నిరంతరము మనలను అల్లుకుంటున్న మాయతెర మనలో దాగిన శక్తులను నిద్రాణముచేస్తూ,మనము గుర్తించలేని స్థితిలో ఉంచుతుంది.మూలాధారము తమోమయము.దానిలో నుండి ఊర్థ్వపయనము ప్రారంభించనంతవరకు పశుపక్ష్యాదులకు వలెనె మానవులకు సైతము

"ఆహార-నిద్రా-భయ-మైథునస్య" ఏ సమస్తముగా ఉంటుంది.అమ్మ అనుగ్రహముతో ఇది కాదు జీవితపరమార్థము అన్న నిజమును గుర్తించి,దానిని తెలుసుకొనుటకు ఉపక్రమించెదరు.

 మానవ మేథస్సు పరిమితమైనది.అమ్మ తత్త్వము అపరిమితము.కారుణ్యము కరావలంబమవుతుంది.మనము ఏ విధముగా ఒకే స్థలములో నున్న వివిధ గదులను వంటిల్లు,నిదురిల్లు,ముందుగది,పెరడు అను వివిధ నామములతో,ఆప్రదేశములో నున్నప్పుడు వివిధ ప్రవృత్తులతో ఉంటాము.అదేవిధముగాబడి-గుడి-వైద్యశాల-గ్రంధాలయము అంటూ వివిధ పనులకు అనువుగా భవనములను పిలుస్తుంటాము.

 మన ఆలోచనలకు అనుగుణముగా/సులభముగా అర్థము చేసుకునే విధముగా జగన్మాత తాను సైతము ఒకే మూలశక్తి అయినప్పటికిని అనేకానేక శక్తులుగా ప్రకటితమగుతూ,పరిపాలిస్తూ,మనలను చైతన్యవంతులను చేస్తుంది.

  దాని ఉదాహరనమే శ్రీచక్రములోని నవావరణములు.

 సాధకునికి తెలిసిన వాటిని చూపిస్తూనే తనను తాను తెలుసుకునే స్థితిని అనుగ్రహించటమే అమ్మ తత్త్వము.

 చక్రము అంటే యంత్రము అను ఒక అర్థము ఉన్నప్పటికిని,మూలము,హృదయము,కేంద్రము,ప్రియమైనది,అతిరహస్యము అను అర్థములలో కూడా సంభావిస్తారు పెద్దలు.

 మొదటి ఆవరనమును త్రైలోక్య మోహన చక్రము/భూపురము అంటారు.

 ఇక్కడ పరమేశ్వరి మూలాధారైక నిలయా.


 అమ్మ ప్రకృతిస్వరూపిణిగా ప్రకటితమయి మూడులోకములను సమ్మోహపరుస్తున్నది.భూతత్త్వముతో ఒక హద్దును చూపించింది అమ్మ భూపురముద్వారా.

 ప్రతి చక్రము ప్రత్యేకమైనదే.పరమార్థమును అనుగ్రహించునదే.

 స్థూలముగా గమనిస్తే త్రైలోక్యమోహనము అనగా

 గాయత్రీమంత్రములో చెప్పబడినట్లు,

 భుః=భువః-సువః లోకములు.

 మానవ దేహమునకు అన్వయించుకుంటే స్థూల-సూక్ష్మ-కారన దేహములను.

 వీటిని చైతన్యవంతము చేయుటయే మోహనత్వము.

 

   వీటన్నిటిలో దాగిన అమ్మ విభిన్నాకృతులు-విభిన్న తత్త్వములు చేతనులకు వారి స్వస్వరూపమును తెలుసుకొనుటకు మార్గదర్శకమవుతాయి.

 మొదటి ఊహా చతురస్త్రము గురించి తెలిసికొనే ప్రయత్నమును చేద్దాము.

 ఈచతురస్రాకారములో ఎనిమిది సిద్ధిశక్తులు పరిపాలిస్తుంటాయి.సమన్వయముతో కొన్ని ద్వారములదగ్గర సాధకుని మార్గము చూపిస్తుంటే మరికొన్ని దిక్కులదగ్గర వానికి దిక్కుగా మారతాయి.

 ఈ ఆవరణ ప్రవేశము సాధకునిలోని నిరుపయోగ రుగ్మతలను తొలగించి,తేజోవంతునిగా తీర్చిదిద్దితాయి.

  మొదటి చతురస్రాకార రేఖలో,

1.అణిమ సిద్ధి

2,లఘిమసిద్ధి

3.మహిమసిద్ధి

4గరిమసిద్ధి

5.ఈశిత్వసిద్ధి

6వశిత్వసిద్ధి

7.ప్రాకామ్యసిద్ధి

8.ఇచ్ఛాసిద్ధి

9.భుక్తి సిద్ధి

10.సర్వకామసిద్ధి మొదలగు శక్తులుంటాయి.

  కొందరివాదన ప్రకారము,గరిమ+మహిమ ఒకటిగాను,

 భుక్తి+ప్రాకామ్య ఒకటిగాను లెక్కించబడుతుంది.

  వాదించే శక్తిలేని నేను ఈసిద్ధిశక్తుల స్వరూపములో అమ్మ సాధకుని ఎలా సహాయ పడుతూ,అనుగ్రహిస్తుందో గమనిద్దాము.

  

 1.అణిమాసుద్ధి-ఇతరులకు అన్వయిస్తే సూక్ష్మముగా మారుట.

 కాని సాధకునికి అణిమా సిద్ధి,

"అణిమాదిభిరావృతాం అహమిత్యే విభావేత్ భవాని" ఆ జగజ్జనని

 సాధకుని యొక్క స్వీయ ప్రాముఖ్యతను/వ్యక్తీకరణమును తగ్గించివేస్తుంది.ఈ నేను చిన్నదయితోకాని నేను ను గుర్తించలేము.

 2.అణిమ సాధకుని స్వీయప్రవృత్తిని తగ్గించి లఘిమకు పరిచయము చేస్తుంది.నేను-నాది అన్న భావనను తగ్గించుకొనిన మనసు విషయవాసనలను రొంపి నుండివిడివడమంటుంది.నీ మనసులోని భావములను తేలికపరుస్తుంది.నిన్ను స్వతంత్రునిగా మలచుటకు నీకు మహిమసిద్ధిని పరిచయము చేస్తుంది.

 3.ఇప్పుడిప్పుడే నీలో దాగిన చైతన్యము నీకు కొంచముకొంచముగా అర్థమవుతుంటుంది.నా ప్రజ్ఞా పాటవములకు కారణము ఆ చైతన్యమే దానిని ప్రకటించే పరికరమే నాఈ ఉపాధి అన్న తత్త్వము బోధ పడుతున్న సమయములోనిన్ను

 ఈశిత్వ సిద్ధికి పరిచయము చేస్తుంది.

4.నిర్మలమనస్కునిగా సాధకుని మార్చివేసేదిఈశిత్వసిద్ధి.పరమాత్మను గమనించాలంటే కాలుష్యము తొలగవలసినదే కదా.కడిగిన ముత్యము వంటి మనసును చేసి వశిత్వ సిద్ధిని పరిచయము చేస్తుంది ఈశిత్వసిద్ధి.

5.వశిత్వ సిద్ధికనుక సాధకునికి సహాయపడితే ప్రపంచస్వరూప స్వభావాలు పూఎరితా మారిపోతాయి.ప్రతిశబ్దము ఓంకారము.ప్రతి రూపము పరమేశ్వరి.ప్రతికార్యము పారమార్థికమే అన్న భావనతో నున్న సాధకుంకి ప్రాకామ్య సిద్ధిని పరిచయము చేస్తుంది పరాత్పరి.

6ప్రాకామ్యసిద్ధి-పరిపూర్ణ కామ్య సిద్ధి.

 సాధకుడు నిత్య తృప్తుడిగా ఉంటాడు ఇంద్రియములు సైతమువిషయవాసనలను విడిచి పరమార్థము వైపునకు దృష్టిని మరలుస్తాయి.ఆ సమయములో ప్రాకామ్యము పరిపూర్ణాందప్రదాయినిని

7.భుక్తి సిద్ధిగా పరిచయము చేస్తుంది.జీవన పరమార్థమును,తననిజస్వరూపమును,తన లోని చైతన్యము చేయుచున్న అద్భుతములను సాధకుడు అనుభవించుచున్న సమయములో 

8 సర్వకామ సిద్ధే సాధకుని సంకల్పము-కామ్యమును చూపుతూనే,

 ద్వంద్వభావనలతో నిండియున్న సాధకునికి చక్రేశ్వరికి వందనము చేయించి,

 రెండవ చతురస్రాకార గీతలోని సప్తమాతృకలకు పరిచయముచేస్తుంది.

 అష్టసిద్ధి దేవతలకు-సప్తమాతృకలకు ఉన్న అవినాభావ సంబంధమేమిటి? వారు మరింత సహృదయభావముతో సాధకునికి సహాయపడతారా అన్న అంశములను తదుపరి భాగములో తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.

  శ్రీ మాత్రే నమః.



BAHIRDASAARA CHAKRAMU-PARICHAYAMU

   పరమేశ్వరి అనుగ్రహముగా మనము సర్వసౌభాగ్యదాయకచక్రమును దాటి"సర్వార్థసాధకచక్రము/బహిర్దశారము అను పదికోణములు వెలుపలగా గల ఆవరణములోనికి ప్రవే...