falasritu.

  నః ప్రయచ్చంతి సౌఖ్యం-ఫలశృతి-శివోహం.
  ************************************

 " గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్ర
   త్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగా నోపునే
   దహనున్ కప్పగ జాలునే శలభ సంతానంబు నీ సేవచే
   సి,హతక్లేశులు కారుగాక జనములు శ్రీకాళహస్తీశ్వరా!

  అని పలికిన మహాకవి ధూర్జటి వాకు శివ శాసనము.


  ఎల్లవేళలా సర్వజీవులకు శివమును-శుభమును కలిగించే స్వభావము కలవాడు శివుడు.జ్యోతిర్మయ శివలింగము ఏకము-అనేకము రెండును తానై విశ్వములోని విశ్వేశ్వరత్వమును మనకు ద్యోతకమగునట్లు చేయుచున్నది.ఈశ్వరేతరము సృష్టిలో లేదను విషయమును తెలిసికొనుటయే ఈశ్వరానుగ్రహము.


  "అడుగడుగున గుడి ఉంది-అందరిలో గుడి ఉంది
   ఆ గుడిలో దీపముంది-అదియే దైవం."

   ఎంత అర్థవంతమైన పాట.

 " విశ్వేభ్యో-విశ్వపతిభ్య్శ్చవో నమో నమః."

  శివానుగ్రహమును తెలిసికొనుటకు ప్రయత్నించే ముందు మనము శివశబ్దము యొక్క గొప్పతనమును అర్థముచేసికొనుటకు ప్రయత్నిద్దాము .

 నమో శ్రుతాయచ-శ్రుత సారాయచ."

 శివ శబ్దముచేత శివ పంచాక్షరి,శివ పంచాక్షరి చేత రుద్రాధ్యాయము,రుద్రాధ్యాయము చేత,తైత్తరీయోపనిషత్తు,తైత్తరీయోపనిషత్తు చేత యజుర్వేదము శివనామ ప్రభావమునకు ఋజువుగా నిలిచినవి.
 నమః శివాయచ-శివతరాయచ.


 శ్రీమత్ శంకర విరచిత శివానంద లహరి,

 " స్తుతి శ్రుతం గర్తసదమ్యువానాం మృగన్న భీమ ముపహత్నుముగ్రం
   మృద్డా జరితే రుద్ర స్తవానో అన్యంతే అస్మన్ నివపస్తు సేనాః"

   అని కీర్తించుచున్నది.స్వామి రూపమును-స్వభావమును క్రోడీకరించినది.స్వామి లాలిత్యము రూపములోను,కాఠిన్యము స్వభావములోను వివరించుచున్నది.

  రూపమును స్వామి క్షీణలక్షణము కల (జరితే) నా శరీరములో కాలమును జయించి,యువకుని వలె,పరుగులు తీయు నా మనసనే లేడిని పట్టుకొని కూర్చున్నాడు.ఇంక నాకే కావలయును.అంతే కాదు,

 మిక్కిలి లోతైన గుహ వంటి నా హృదయములోం,లోపలికి ప్రవేశించుటకు ప్రయత్నించుచున్న నక్కలు-తోడేళ్ళు వంటి కర్మలపై,ఎగిరిదూకి,పట్టి కొట్టడానికి సిధ్ధముగా నున్నపూర్తి సంసిధ్ధతతో నుండగా ఇంక మనకేల విచారము.

 నమః ఉగ్రాయచ-భీమాయచా.

  మనలను మన అరిషడ్వర్గములను మనసులోనికి రానీయక వేటాడుచు,

 నమః ప్రతరాణయచ-ఉత్తరణాయచ" మన సంసారజలధిని నావయై దాటించి,మనలను తరింపచేయును గాక.

 ముక్కంటి కరుణను ముచ్చటించవలెనన్న ఒకటా రెండా-మూడా?లెక్కలేనన్ని.వాటిని శ్వస్వరూపులు స్వానుభముతో సదాశివసేవలో సందర్శించెదరు గాక.

  నా చిన్ని ప్రయత్నము లోపభూయిష్టమే అయినప్పటికిని,శివానుగ్రహమను పవిత్ర జలముచే ప్రోక్షణ చేయబడినది కావున సకల శుభముల నొసగు గాక.మనలను సన్మార్గమున నడుపు గాక.ప్రతి దానిలో పరమేశ్వరుని ప్రత్యక్షము చేయుగాక.

 మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః
 బాంధవా శ్శివభక్తాశ్చ స్వదేహో భువనత్రయం.

   సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.-స్వస్తి.

 గమనిక-శివ స్వరూపులైన వివిధ గుంపుల నిర్వాహకులు తమ గుంపులోనికి ప్రచురించుటకు అనుమతించినందులకు సర్వదా వారికి కృతజ్ఞురాలను.

  వీక్షకులైన శివస్వరూపులుతమ అభిప్రాయములను తెలియచేసినందులకు, నన్ను ప్రోత్సహించినందులకు నమోవాకములు.

 ఇప్పటికి విరామము తీసుకుంటూ,మీ సోదరి,నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)