0007

అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో ప్రసీద మమ సర్వదా మాతా కాళరాత్రి నమోనమః " ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరస్థితా లంబోష్ఠి కర్నికాకర్ణీ తైలాచ్యక్త శరీరిణీ వామపాదోల్లిసల్లోహలితా కంతకా భూషణా వరమూర్థ్వ ధవజా కృష్ణాకాళరాత్రిర్భయంకరీ." జుట్టును చెల్లాచెదురుగా విరబోసుకొని,పెద్దగా వాచిన పై పెదవితో,శరీరమంతా తైల లేపనముతో,ముళ్ళ ఆభరనములను ధరించి,గాడిదపై ఎడమకాలు ముందుకు చాచి,కూర్చున్న కాళరాత్రి మాత మనలను రక్షించు గాక. కాళరాత్రిః మహారాత్రిః మోహరాత్రి చ దారుణా" రాత్రిసూక్తము. అంటూ రాత్రి తత్త్వము నాలుగు విధములుగా ప్రస్తుతించబడినది.దీపావళి ముందురోజువచ్చే చతుర్దశిరాత్రి కాళరాత్రి.దీపావళినాటి రాత్రి మహారాత్రి.శ్రీకృష్ణజన్మాష్టమి మోహరాత్రి.అక్షయతృతీయ దారుణరాత్రి అని పెద్దలు చెబుతారు. అసలు మనము రోజు నిద్దరపోయే సమయమే రాత్రియా లేక రాత్రి శబ్దము ఇంకేమైన అంతరార్థమును కలిగియున్నదా అని మనలను మనము ప్రశ్నించుకుంటే ప్రతిజీవి అంతర్ముఖమే రాత్రి.బహిర్ముఖమే పగలు.కర్షణాత్ కృష్ణః.సమస్తమును తనలోనికి ఆకర్షించుకొనుశక్తి కృష్ణతత్త్వము.అదియే కాళరాత్రి తత్త్వము. పరాపరాణాం పరమం త్వమేవ పరమేశ్వరి. ఇక్కడ జీవుని పరా గాను-ప్రకృతిని అపరముగాను వీటి రెండింటిలో చైతన్యమును ప్రసాదిస్తూ,ఈ రెండింటికి అతీతమైన శక్తియే కాళి. తల్లి రూపము భయంకరము కాని స్వభావము శుభంకరము.మనకు అసురబాధను తొలగించుటకు ,పరమ శివుడు గరళమును తన కంఠమున నిలుపుకొనినట్లు (మహాకాలుడు) రక్తబీజుని రక్తపు బొట్లను తాను స్వీకరించినది తల్లి.పరహితము కొరకు "పరోపకారార్థమిదం శరీరము" అను సూక్తిని నిజము చేస్తూ,తల్లి ఒక్క బొట్టును కూడా కిందపడనీయకుండా సేవించి,తత్ప్రభావమా అనునట్లు లోకములను గజగజలాడించుచు వికృతముగా నాట్యము చేసినది.ఇవేవి నిరాకార-నిర్గుణ-నిరంజన-నిశ్చల తత్త్వమును చేరలేవను సత్యమును చాటినది.దీనిని బట్టి బాహ్యము తాత్కాలికము అశాశ్వతము-లోపలి పరబ్రహ్మము నిత్యము నిర్మలము అని తెలిసికొనుటకు సాధకులు సహస్రార చక్రములో ఆత్మతత్త్వమును అనుసంధించుకొని ఆనందాబ్ధిలో తేలియాడుతుంటారు. మనశరీరమే ఆయుధగారము.మన ఇంద్రియమే మనకు సహాయకారి అను విషయమును కాళరాత్రి మాత ఆదిశక్తి నుదురునుండి ఆవిర్భవించి,వరప్రసాదుడైన రక్తబీజుని అంతము చేయుటకు,తన నాలుకనే ఆయుధముగా మలచుకొని,విస్తరింపచేసి రక్తబిందువును తాను స్వీకరిస్తూ,వానిని శక్తిహీనునిగా (రక్తహీనునిగా) చేసి,సంహరించినది. అసురుని రక్తము అమ్మను ఆవేశముతో భీకరనాట్య ప్రక్రియగా అడుగులను కదిలించినది.కాళి కదలికలు భూమిని నిర్వీర్యము చేస్తున్నవి. .ధర్మము అధర్మరక్త ప్రభావమునకు బలికాకూడదు .కరుణతో శివుడు తటస్థుడుగా అమ్మ గమనముగా అడ్డుగా పడుకుని,అమ్మను శాంతింపచేసినాడు . కాలమే కాళరాత్రి.అది.మనకున్నట్లు దానికి భూత-వర్తమాన-భవిష్యత్ దశలుండవు.దాని సంకేతమే తల్లి ఆభరణముగా ధరించిన ముండమాల.జీవుల చేతలే(పనులే) శక్తి నడుముకు కట్టుకున్న చేతుల ఆచ్ఛాదనము. .అద్భుతశక్తివంతమైన కాలము తన ప్రయాణములో మనలను(జీవులను)తనతో ప్రయాణింపచేస్తూ,సమయము వచ్చినప్పుడు మనలను విడిచివేస్తుంది.దాని వలన ఏమి ప్రయోజనము అను సందేహము రావచ్చును.మన తప్పటడుగుల సమయమున మనలను తన చేతిని పట్టి నడిపించిన అమ్మ మనకు నడక వచ్చిన తరువాత నడిచేటప్పుడు వదిలివేస్తుంది.అదే విధముగా కాలస్వరూపమైన కాళరాత్రి మాత తనతో కలిసి మనము చేస్తున్న ప్రయాణములో కొన్ని అద్భుతాలను చూపిస్తూ,ఆవేదనలను కలిగిస్తూ,అత్మ శోధనకై మనలను సవరిస్తూ-సంస్కరిస్తూ,సాధక దశ నుండి ముముక్షువుగా మలుస్తూ,స్వయంసిధ్ధతను అనుగ్రహిస్తూ,మనలను విడిచివేసి,తన ప్రయాణమును కొనసాగిస్తుంది.శరీరమనే వాహనమును నిచ్చెనవలె ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి చేర్చుటకు మాత్రమే ఉపయోగించుకొవాలనే వివరము ఇస్తుంది.మేడ ఎక్కిన వాడు నిచ్చెనను తనతో పైకి తీసుకువెళ్ళడు కదా.పని ముగియగానే పరిత్యజిస్తాడు. కాల స్వరూపమై కాంతిమార్గమును చూపుట అమ్మ సంకల్పము అంతర్ముఖులమై అమ్మ తత్త్వమును అర్థముచేసుకొనుట మన సంకల్పము. అమ్మ చెంతన నున్న మనకు అన్యచింతనలేల? అమ్మ దయతో మన ప్రయాణము కొనసాగుతుంది. అమ్మ చరణములే శరణము. 00

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)