ALO REMBAAVAI-01
ఓం నమో నారాయణాయ.
*****************
ద్రవిడ సంప్రదాయము పరమాత్మను గుర్తిస్తూ-కీర్తిస్తూ-తరిస్తూ-తరింపచేసే సాహిత్య గాన ప్రక్రియను పాశురముగా పరిగణిస్తారు.
పన్నెండు మంది ఆళ్వారులు అనుభవించి,అందించిన పాశురముల సమాహారమును నాలాయిరం అని కీర్తిస్తారు.
ద్వాదశాళ్వారులలో పరమ పునీత ఆండాళ్ తల్లి అవ్యాజకరుణతో అనుగ్రహించినది ఈ ముప్పది పాశురముల ముక్తిమాలిక.
ఇంకొక విషయము ఏమిటంటే పరమాత్మ యొక్కడేపురుషుడు.మనమందరము జీవులము.
అమ్మ దయతో పరమాత్మ తత్త్వమును అర్థముచేసుకుంటూ, ఆచరిస్తూ,ఆస్వాదిస్తూ,అనుభవిస్తూ,
అడుగులను కదుపుదాము.
ఏలో రెంబావై-01
*****************
మొదటి పాశురం.
***************
"మార్గళిత్తింగళ్ మది నిరైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్! పోదుమినో నేరిళైయీర్
శీర్మల్లుం ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్కాళ్
కూర్వేల్ కొడున్ తొళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళం సింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్ మదియంపోల్
ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైదరువాన్
పారోర్ పుగళప్పడిందు ఏలోరెంబావాయ్."
ఓం నమో భగవతే వాసుదేవాయ
********************************
నేరిళైయీర్-సుగుణాభరణభూషితులైన బాలికలారా,
నన్నానాళ్- ఇవి పవిత్రమైన రోజులు/సమయము.
ఎందుకు అంటే,
మార్గళి తింగళ్- మాసాలలోకెల్ల మహత్తరమైన మార్గశీర్ష మాసము.
అంతేకాదు, ఈ రోజు,
మధినినంధ-నిండు పున్నమి.మనసులో ఆచార్యుల ఆశీర్వచనముతో అమృతత్త్వము అందుకొనబోవు సుదినము.
ఇంకో విశేషము కూడా ఉంది.అదేమిటంటే,
ఇలం సింగం-యువకిశోరమును మనము చూడవచ్చును.వాడు,
తొళిన్-భుజము మీద,
కూర్వేల్-వేలాయుధమును పట్టుకుని,శత్రువులనుండి మనలను రక్షించు నందమహారాజు కుమారుడు.
అంతేకాదు,
ఏరారంద కణ్ణి-పద్మములవంటి కన్నులుకల,వైజయంతిమాలను ధరించిన,మహిమాన్వితమైన,
యశోదై-కీర్తిని స్వంతము చేసుకొనిన-కీర్తియే తానైన
యశోదమ్మ ముద్దుల కన్నడు.
వాడి సౌందర్యము చెప్పనలవికాదు.
కతిర్ పోల్-సూర్యుని ప్రకాశమును పోలిన ప్రకాశము కలవి వాడి
శెం కణ్-అందమైన కన్నులు.
మదియుం పోల్-చంద్రుని పోలినది
ముగత్తాన్-వాడి ముఖము.చల్లదనమును వెదజల్లుతుంటుంది.
కార్మేనిం-వాడు నీలమేఘశ్యాముడు.
మనమా,
ఆయ్పాడి-సంసారమనే చీకటిలో మునిగియున్నాము.
వాడు అందగాడే కాదు- అనుగ్రహించుటకు పఱ అను వాయిద్యముతో( పరమును) సిధ్ధముగా నున్నాడు (మనలకు.)
శీర్మల్గుం-మనము అనుగ్రహమునకు అనువైన ప్రదేశములో నున్న వారలము.
పోదువీర్-పోదుమినో-ఎవరు బయలుదేరి వద్దామనుకుంటున్నారో రండి.ఎక్కడికి అని అడుగుతారేమో,
నీరాడ-యమునలో స్నానము చేసి,
నమక్కే-మనలను అనుగ్రహించి,
పఱై తరువాన్-పఱను ఇచ్చే,
నారాయణనే-నారాయణుని,
పుగళ్-ప్రస్తుతించు/కీర్తించు,
పావై-నోమునకు,
ఎన్-రండి.
గోదమ్మ తానొక గోపికగా మారి,(పరమాత్మ ప్రకృతిగా ప్రకటనమగుతు-తన అంశద్వారా)
గోకులములోని తోటి గోపికలతో ఆడుతూ-పాడుతూ స్వామిని వేడుకునేటట్లు చేయాలని నిశ్చయించుకుంది.అందరము కలిసి సిరినోమును నోచుకుందామని చెబుతున్నది.దానికి అనుకూలమైన సమయ-సందర్భములను వివరిస్తున్నది.యశోదా-నందులను ప్రస్తుతిస్తున్నది..బాలకృష్ణుని రూపలావణ్యములనే కాదు,అనుగ్రహ స్వభావమును తెలియచేస్తూ,అసలే,
మనము చీకటితో నిండిన సంసారములోనున్నవారమని,అయినప్పటికిని మన భాగ్యవశమున పరమాత్మ నదయాదు నందవ్రజమున నున్నామని తెలియచేస్తూ,వారిని వ్రతోన్ముఖులను చేస్తున్నది.
ఇది సామాన్యార్థము.వాచ్యార్థము..
శ్రీకృష్ణం శరణం మమ.
సర్వాభరణభూషితులైన గోపకాంతలట.వారు ధరించిన భూషణములు-నవవిధభక్తులు అను నాణ్యమైనవి.
వారు పున్నమి చంద్రుని వెన్నెలలో తడుస్తున్నారంటే,స్వామి సుగుణ నామ సంకీర్తములో మునిగియున్నారు.ఆ వెన్నెల జ్ఞానగుణ అనుగ్రహము.
వారు యమునలో మునిగి చేయు మార్గళి స్నానము భవబంధములను మురికిని తొలగచించుకొను వైనము.
వారెంతటి జ్ఞానులంటే వారు సంసారమనే చీకటిలో నున్నామను తెలివికలవారు.దానికి ప్రకాశమునిచ్చు సూర్యుని వంటి నేత్రములు-ప్రశాంతతనిచ్చు చంద్రునిముఖము గల కృష్ణుని శరణుకోరు స్పృహ వున్నవారు.
పరమాత్మలోని చైతన్యమే పరమసాధ్వి గోదమ్మ.పరమార్థమును పంచుటకు అవతరించిన ఆండాళ్ దివ్య చరణములకు నమస్కారములు.
అమ్మ చేతిని పట్టుకొని అడుగులను
కదుపుదాము.
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
Comments
Post a Comment