KALIYA NAYANARU
కలియ నాయనారు.
*****************
ఆడిన మాటను నిలబెట్టుకొనుటకై ఆలిని అమ్మకమునకు పెట్టి,అమ్మివేసిన ఘనత హరిశ్చంద్రునిదైతే,
ఆదిదేవునికి దీప ప్రజ్జ్వలములచే సేవించుటకై తన ఆలిని అమ్మకమునకు పెట్టిన ఘనత కలియనాయనారుది.
అన్నింటికన్న అర్చనయే అతిముఖ్యమన్న సిధ్ధాంతముతో నున్న కలియ నాయనారు తిరవట్రూరు లో వైశ్య కుటుంబమునందు జన్మించెను.నూనె వ్యాపారము వృత్తి.
దీపప్రజ్వలనముతో శివారాధనము చేయుట ప్రవృత్తి.
" సాజ్యంచ వర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
దీపం గృహాణ దేవేశ త్రైలోక్యం తిమిరాపహం.
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నిరయాద్ ఘోరాత్ దీపంజ్యోతి నమోస్తుతే."
ఓ త్రిలోక తిమిర సంహారకా! సత్వ-రజో-తమో గుణములనే త్రిగుణములను వత్తులుగా చేసి,భక్తి యనే చమురుతో,హృదయమనే ప్రమిదలో చైతన్యమనే అగ్నితో వెలిగించిన దీపము నీ ప్రతిబింబమై నా పాపములనే చీకట్లను పారద్రోలును గాక.
తేజము కలియ చుట్తుప్రక్కల విస్తరించి సమస్త చీకట్లను తరిమివేయునుగాక అను సిధ్ధాంతమును నమ్మువాడు కనుక ,కలయ(చుట్ట్
ఉప్రక్కల) చీకట్లను తాను వెలిగించిన దీపములతో పారద్రోలువాడు కనుక కలియ నాయనారుగా పేరుగాంచినాడు.ఇది బాహ్యము/వాచ్యార్థము.
" మాయామేయ జగంబు నిత్యమని భావించి మోహంబునన్
నా ఇల్లాలని, నా కుమారుడని,ప్రాణంబుండు నందాకనేనను" సంసార బంధములను చుట్టు కమ్ముకుని యున్న చీకట్లను పారద్రోలుటకు,
సత్యహరిశ్చంద్రుని వలె తాళికట్టిన ఆలిని సైతము అమ్మకమునకు పెట్టి,లభించిన ధనముతో సత్వదీప ప్రజ్జ్వలనమునకు సిధ్ధపడిన సర్వజ్ఞుడు నాయనారు. ఇది ఆంతర్యము దాగిన ఆధ్యాత్మికము.
దీపము తాను ప్రజ్వలించుచు తన చుటు కమ్ముకొనియున్న చీకట్లను తాను కరిగిపోతూ ఏ విధముగా కనుమరుగు చేయునో అదే విధముగా,
కాలకంఠుని ఆనగా కలిమి తరలిపోయినను ,తన ధైర్యమును విడనాడక తనను తాను గానుగకు కట్టుకుని గిరగిర తిరుగుచు,నూనెను తీసి,స్వామికి దీపోత్సవమును జరిపించెడివాడు.
పరమేశ్వరానుగ్రహ పరిశీలనా చాతుర్యమేమో ప్రజ్వరిల్లుతున్న దీపము తన ప్రాశస్త్యమును పరిపరివిధములుగా నాయనారుకు బోధిస్తూనే ఉండేది.తన చుట్టూ ఉన్న పసుపు వృత్తములు తనలోని చైతన్యమని,అరుణ గోళములు తేజో పుంజములని,వాని నుండి కిందకు రాలుచున్న అణువులు/పరమాణువులు శక్తిపాతములని ,తిమిర సంహారములని,జడరహితములని ఉపదేశిస్తూనే ఉండేది.నాయనారుని పరవశింపచేస్తుండేది.
కాలము మాయాజాలమును ఎవ్వరును తప్పించుకోలేరన్నది కాదనలేని సత్యము.
హరుని ఆనగా సంపదలు హరించిపోతున్నవి దారిద్రపు చీకట్లకు దారిచూపుతూ.
దొరికిన కొన్నింగింజలను గానుగలో వేసి తాను గానుగ చుట్తు తిరుగుతూ లభించిన నూనెతో దీపములను పరమ సంతోషముతో వెలిగించెడివాడు.
సంసారమనే గానుగలో తాను తిరుగుతున్నప్పటికిని భక్తి అనె గింజలను దానిలో వేసి భావమనే తాడుకు తన జీవుని కట్టి,నిరంతర స్మరణమనే వృత్తము చుట్టు పరైభ్రైస్తూ/ప్రదక్షిణమును చేస్తూ లభించిన పుణ్మనే చమురుతో మనసనే వత్తిని ముంచి నిష్ఠ అని అగ్నితో వెలిగించి పరమానందమును పొందుచుండెడి వాడు.
కాని అది భగవంతునికి -భక్తునికి మధ్య జరుగున్న అలౌకికానంద సుందరబంధము.అమృతానంద మరందము.అత్యయంత అనుగ్రహ ఆనందసాగరము.అది అంతటితో ఆగితే సరిపోదు.జగద్విఖ్యాతము చేయాలని జంగమదేవర సంకల్పము.
కనుక కాసిని గింజలు కూడా కరువైపోయినవి నాయనారుకు.దీపారాధనమునకు తైలమును సేకరించుతకు మనసు పరి పరి విధములుగా ఆలోచించుచున్నది.
" నమో గృత్యేభ్యో గృస్తపతిభ్యశ్చవో నమః'
ఆశపడు స్వభావమును కలిగించు బుధ్ధిమంతులకు ప్రభువగు సదాశివా నమస్కారములు.
పరమ నీతిమంతుడైన నాయనారుకు నీ దీపార్చనకు కావలిసిన తైలము కొరకై,తన ధర్మపత్నిని అమ్ముటకు సిధ్ధపడునట్లు చేసినావు.
చిదంబరములో ఆలిని అమ్మకమునకు నాయనారు పెట్టినప్పటికిని ఆమెను కొనుటకు ఎవ్వరును ముందుకు రాలేదు.
నమో మంత్రినే వాణిజాయ కక్షానాం పతయే నమః
వణిజులలో/వర్తకులలో ఏమి ఆలోచనలను అందించాడో తెలియదు కాని నాయనారు వర్తకము సఫలము కాలేదు.
భార్యను అమ్ముడు పోనీయలేదు ఆలికి అర్థభాగమునిచ్చిన వాడు.
దీప ప్రజ్జ్వలనుము మానివేయలేడు-కావలిసిన తైలమును సమకూర్చుకొనలేడు.
విషమును కంఠములో దాచుకొనిన వాని విషమపరీక్షయా లేక విషయమును అవగతము చేసుకొనినవాని వ్రతదీక్షయా నెరవేరునది తనను తాను నిరూపించుకొని.
ఇక్కడ వెలగవలసినవి దీపములు కావు స్వామి కృపా కటాక్షపు తేజోరూపములు.
బేసికన్నులవాడు ముసిముసి నవ్వులతో నడిపిస్తున్నాడు ఒకవైపు పరీక్షను మరొక వైపు దాక్షిణ్యమును ఒకదాని తో మరొకదానిని ముడిపెడుతూ .
ప్రదోష సమయము ప్ ఒంచి చూచుచున్నది
మించిన ఉత్సాహముతో .
నమో స్రోతస్యాయచ
దేహమునందలి రక్తనాలములుగా కలవాడా నీకు నమస్కారములు.
అంతే నాయనారు మనసులో ఆలోచన తలుక్కున మెరింది కాదు కాదు కలిగింపచేశాడు కపర్ది.
వెంటనే కొడవలితో తన కుత్తుకను కత్తిరించుకుని,వచ్చిన నెత్తురుతో దీపములను వెలిగించాలనుకున్నాడు.
అచంచలభక్తి అడుగు వెనుకకు వేయనీయలేదు. అనుకున్నదే తడవుగా , ఆదిదేవుడు అవ్యాజకరుణా మూర్తి ఆనందాంతరంగు డై అడ్డుపడ్డా డు
నాయనారు భక్తిని ఆ చంద్ర తారార్కము విరాజిల్లచేయుటకై .అనుగ్రహించి ఆశ్రీవదించినాడు తన సాయుజ్యమునిచ్చి.
కలియ నాయనారును కటాక్షించిన కపర్ది మనలనందరిని అనిశము సంరక్షించును గాక.
ఏక బిల్వం శివార్పణం.
"
Comments
Post a Comment