PAAHIMAAM SIVADUTI-


పాహిమాం శివదూతి-శివంకరీ-శ్రీమత్ సింహాసనేశ్వరీ
**************************************

 " బాలసూర్య ప్రతీకాశాం బంధుక ప్రసవారుణాం
   విధి విష్ణు శివస్తుత్యాం దేవగంధర్వ సేవితాం
   రక్తారవింద సంకాశం సర్వాభరణ భూషితాం
   "శివదూతీం" నమస్యామి రత్నసింహాసన స్థితాం"

   ఉదయభానుని ప్రకాశముతో ఎర్రని అరవింద పుష్పముల ప్రభలుకలిగిన ఆభరణములతో అనవరము బ్రహ్మ-విష్ణు-రుద్రాదులచే ,దేవ-గంధర్వులాదులచే స్తుతింపబడుతు రత్నసింహాసనమున ఆసీనురాలైన శివదూతి మాత మనలను అనుగ్రహించుగాక.


 ఇక్కడ రక్తబీజుడు అనురక్తితో తన శరీరమునుండి కారుచు నేలపై బడుచున్న రక్తబిందువులచే అనేకానేక రక్తబీజులను వరప్రభావముతో సృష్టిస్తూ,తమ సైన్యములను పెంపొందించుకుంటు అమ్మను చూస్తూ,హేలనగా మాట్లాడుతున్నాడు.
 అదే సమయములో వాని సంస్కరించదలచినదేమో అమ్మ అన్నట్లుగా అమ్మ ముందు శివుడు ప్రత్యక్షమై,
"తతః ప్రతివృతాస్తాభిరీశానో దేవశక్తిభిః
 హన్యంతాం అసురాః శీఘ్రం మమప్రీత్య... హ చండికాం"

ఓ చండికా! నేను సంతసించురీతిగా ఈ రాక్షసులందరిని త్వరగా సంహరింపుము.అని పలుకగానే
 అనగానే తల్లి అసలే
 "శివా స్వాధీన వల్లభా" కనుక తాను తన స్వామి మాటను అనుసరిస్తూనే,తన మాటను స్వామి అనుసరించేలా చేసినది.
   వెంటనే దేవి శరీరమునుండి,
 "తతోదేవి శరీరాత్తు వినిష్క్రాంతాతిభీషణా
 చండికాశక్తిరత్యుగ్రా శివా శతనినాదినీ"
 మిక్కిలిభీషణమైన శక్తి భయంకరమైన శబ్దముతో ఉద్భవించెను.
   ఆ విధముగా ప్రకటితమైన శక్తి,
 " శివదూతి శివారాధ్యా శివమూర్తిః శివంకరీ"
     తన ఎదుటనున్న శివునితో,
 నమో దూతాయచ-ప్రహితాయచ-సర్వజనుల మేలుకోరుతూ,దూతత్వమును నెరపు ప్రజ్ఞకలవాడవు(.పెరియపురాణము)
 "దూతత్వం గఛ్చ భగవన్ పార్శ్వం శుంభమ్నిశుంభయోః"
   భగవానుడా! నీవు శుంభ-నిశుంభులవద్దకు దూతగా పొమ్ము.
   వారితో నా మాటగా ఇట్లుచెప్పుము అని తన సందేశమును మూడుషరతులను తెలియచేస్తూ విధించినది.
 1.బ్రూహి శుంభ-నిశుంభంచ" మొదటిది,
 "త్రైలోక్యమింద్రో లభతాం దేవాః సంతు హవిర్భుజః
  యాయుం ప్రయాత పాతాలం యది జీవితమిచ్చిథః"

   యాది జీవితమిచ్చథః-వారు కనుక జీవించాలనుకుంటే,జీవితముమీద ఆశ ఉంటే,వారు
1. యాయుం ప్రయాత పాతాలం-పాతాలమునకు తరలిపోవలెను.
2.త్రైలోక్యం ఇంద్రాం లభతాం
  త్రిలోకములకు పరిపాలకులుహా ఇంద్రుని ఒప్పుకోవలెను.
3.దేవాః సంతు హవిర్భుజ-వారి హవిస్సులు వారికే చెందవలెను.మీరు దానిని అడ్దుకోకూడదు అని చెప్పు.
   ఒకవేళ వారు అందులకు అంగీకరించనిచో,
  సర్వోపాధి వినిర్ముక్తా-సదాశివ పతివ్రతా
 తన హెచ్చరికను తెలియచేయమనినది.
 బలగర్వముతో మీరు యుద్ధమునే కోరుకొనిన ఎడల,
 "బలావలేపాదథ చేద్భవంతో యుద్ధకాంక్షిణః
  తదాగచ్ఛత తృష్యంతు మచ్ఛివా పిశితేన వః"
   అని తన కరుణను మరొకసారి వివరిస్తూ కపర్దిని దూతగా వారిదగ్గరకు పంపినది.

 అసురసైన్యము పంపిన దూత సుగ్రీవుడు.అమ్మ తత్త్వమును తెలుసోకోలేని అజ్ఞాని.దానికి తోడు వాచాలత్వముతో అమ్మను దూషించినవాడు.అపరాథములు చేయు స్వభావము కలవాడు.
  అమ్మ పంపిన దూత సదాశివుడు.సర్వజ్ఞాని.దానికితోడు వాంఛితార్థములీయగలడు.అపరాథములను క్షమించగలడు..
 శుంభ-నిశుంభులు శంభుని రాక తమ రక్షణకేనని తెలుసుకుంటారో లేక దంభముతో రణమునకు కాలుదువ్వుతారో తరువాతి భాగములో అమ్మదయతో తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.
  సర్వం శ్రీమాతాచరణారవిందార్పణమస్తు.


   
    

 

 

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)