KADAA TVAAM PASYAEYAM-12



కదా త్వాం పశ్యేయం-12 ************************* " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం."… " జనన మృతి యుతానాం సేవయా దేవతానాం "న భవతి సుఖాలేశః" సంశయో నాస్తి తత్ర అజనిమం అమృతరూపం సాంబమీశం భజంతే య ఇహ పరమ సౌఖ్యం తేహిధన్యా లభంతే." ఆ పరమసౌఖ్యప్రదుడైన పరమేశ్వరుని మన మనోఫలకమునందు స్థిరముగా నిలుపుకుని ఈనాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము. ఇంతకీ వీళ్ళు చెప్పే మహాదేవుడు ఒక్కడేనా లేక ఆ విప్రుడు చెప్పినట్లు,ఈ తాతగారు చెబుతున్నట్లు అనేకులా అన్న సందేహము , "కమర్థం దాస్యేహం భవతు" అన్న లక్ష్యమునకు అడ్డుగోడ కడుతూనే ఉంది (ధీకుల్యా) ఈశ్వరానుగ్రహమను "కిల్బిషరజమును" తన ప్రవాహలహరులచే పూర్తిగా నిర్మూలిస్తూ,"దిశంతీ విజయతాం" దీవెనలను అందిస్తున్నది. అదేసమయమున తన తుమ్మెదలతో ఆటను ఆపి అక్కడికి వస్తూ,ఆ తాతగారి మనవడు , ఏమిటి? మీరింకా ఇక్కడే,ఇలానే కూర్చుని ఉన్నారా? మాతాతయ్య కాసేపు నిద్రపోయి,కాసేపు శ్లోకములు పాడుకుని,మెల్లగా సాయంత్రం-అదే ప్రదోష సమయమంటాడులెంది అప్పుడు పూజచేసుకునికాని మీతో కథాకాలక్షేపమునకు రాడు. మీ ఇష్టం అన్నాడు. " మయి సర్వమిదం భూతం'అన్న మహాసూక్తిని పరిచయం చేద్దామనుకున్నాడేమో మహాదేవుడు శంకరయ్యకు,తుమ్మెద గురించి తెలుసుకోవాలనే కుతూహలము కలిగింది.అక్కడ నుండి కదలనీయనంది. వీడికి ఈ తుమ్మెద ఎందుకు ఇష్టమో అడిగి కాసేపు ఆగి వెళ్ళిపోతాను.అనుకుంటూ, నాదొకచిన్న సందేహము.నీవుకనుక దానిని తొలిగిస్తే వెనుకకు మరలి,వెళ్ళిపోతాను అన్నాడు. ఈ చిన్నవాడు నా సందేహమును తీర్చే సమస్యయే లేదు.నన్ను వెళ్ళమనే ప్రసక్తే లేదు అని తనలో తాను సమాధాన పరచుకుంటూ. "బుద్ధి ఈశ్వరపాదపద్మ స్థిరా భవతి" అని ప్రార్థించి,అదగండి శంకరయ్యగారు. తెలిస్తే చెబుతాను.లేకపోతే తాతగారున్నారుగా అన్నడు చిలిపిగా. ఇందాకమీ తాతగారు ఒక శ్లోకమును పాడుతుంటే విన్నాను. న భవతి సుఖాలేశః-కొంచము కూడా సుఖము లేదు,ఆ హరి బ్రహ్మాదులను అర్థించటము వలన అని,ఓం నమః శివాయ అంటూ,ఆ ఐదు అక్షరాలను పదే పదే అంటున్నారు. నవ్వుతూ,ఓ ! అదా,ఆపంచాక్షరి .... చెప్పబోతుందగా,శంకరయ్య మధ్యలో బాలునితో అసలు ఈ తుమ్మెద కథ ఏమిటి? మీ తాతగారు నిన్ను తుమ్మెదలతో ఆడుకోవటానికి ఎలా ఒప్పుకున్నారు? ఎందుకు వాటిని వదలమనకుండా ఉన్నారు? అడిగాడు ఆశ్చర్యముగా . ఓ అదా మీ సందేహం.అయితే చెబుతా పూర్తిగా వినండి.కాని మధ్యలో కనుక ప్రశ్నలు వేస్తే నేను అంతా మరచిపోతాను.మీరు శ్రద్ధగా వింటానంటే చెబుతా, అంటూ నా క్రమశిక్షణకు మెచ్చి ,మురిసిపోయి మా తాత ,నేను నా స్నేహితులతో ఆడుకునేందుకు అనుమతిని ఇచ్చాడు.కాని ఒక షరతును పెట్టాడు. ఆ స్నేహితుడు ఎప్పుడు నాతోనే-నేను అతనితోనే విడిపోకుండా ఉండాలన్నాడు. నేను సరే అని సంతోషముతో నా మొదటి స్నేహితుడైన బ్రహ్మం ని అడిగాను.వాడికి సంతోషమేకదా.వచ్చాడు.రెండుగంటలసేపు నా దగ్గర ఉన్నాడు.అంతే... అంతే అంటే ..అదే వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళీపోయాడు. వాళ్ళ అమ్మ-నాన్న అంత సమయమే ఆడుకోనిస్తారట.అంతకంటేఅనుమతిలేదట వాడికి.వాడికి పెద్దపనిని అప్పగించారట వాళ్ళూ. వాడు చిన్నపిల్లవాడే కదా.అంత పెద్దపని ఎలా చేస్తాడు అదగాలనుకున్నాడు శంకరయ్య.కాని అదగలేడు కదా ఒప్పందం ప్రకారము. అసహనముగా ఏమిచెబుతాడు ఈ పిల్లవాడు ? అసలు ఆ బ్రహ్మం అంత ...స్వతంత్రుడు కాదులెండి. అదేనండి వాళ్ళకి పెద్ద తోట ఉంది.అందులో వాళ్ళఅమ్మా-నాన్నలు ఆపమని చెప్పేవరకు "విత్తనాలను నాటుతూనే ఉండాలంట." నాతోనే ఉండాలన్న మా తాతయ్య మాటకు కట్టుబడి వానిని ఇంక మా ఇంటికి పిలవలేదు. దిగులుగా ఉన్న నన్ను చూసి ఇంక స్నేహితులెవరు లేరా నీకు? ఇంకొక అవకాశము అంటు మా తాతయ్య అనగానే "హరి" గుర్తుకు వచ్చి వాణ్ణి పిలిచాను.వాడు అంతే నిన్ననే ఆ బ్రహ్మం మా తోటలోను విత్తనాలు నాటాడు.కాసేపు నీతో ఆడుకుని,నేను ఆ తోటకు నీళ్ళను మళ్ళీంచాలని అన్నాడు.మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ఈ సారి మా తాత చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుని మూడో స్నేహితుడనుకునే వాడిని పిలిచాను.వాడూ అంతే.నేను సైతము తోటపని చేయాల్సిందే.ఆ పంటపండి ఎండిపోబోతోంది.వాటిని తీసేసి,మళ్ళీ ప్రారంభించాలి.నువ్వు ఆడుకొని త్వరగా వస్తే పంపిస్తాం అన్నారట వాళ్ళ అమ్మా-నాన్న. ఏమి రావద్దులే మా ఇంటికి కొంచము సేపయితే అన్నాను. దిగులుగా ఇంటికి తిరుగువస్తున్నాను.తాతయ్య అనుమతినిచ్చినా నాతో వచ్చి నాతోపాటుగా నన్ను ఆడిస్తూ,మురిపించే వారే లేరా ఇంత పెద్ద...కన్నీళ్ళు వస్తున్నాయి.నాతో పాటుగా నా వెనుకే,నన్ను గమనిస్తూ, పోనీ నన్ను రమ్మంటావా మీ ఇంటికి? నీతో ఆడుకోవటానికి-పాడుకోవటానికి-అవసరమొస్తే వేడుకోవటానికి అన్నది ఝంకారము చేస్తూ.ఈ తుమ్మెద.కళ్లప్పగించిచూశాను దానివంక. నాతో పాటే ఉండాలి.మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అనకూడదు తుమ్మెదానువ్వు.అని షరతును పెట్టాను. దానిదేముంది మావాళ్ళు కూడా నాతోనే ఉంటారు/అదేనీతో పాటుగా ఉంటాము అన్నది ఝుంటి తేనియల సాక్షిగా. సంభ్రమముగాచూసాను దీని వంక,అంటూ నల్లని గండు తుమ్మెదను తదేకంగా-తన్మయత్వముతో చూస్తున్నాడా బాలుడు. " ఆత్మాతు సతతః ప్రాప్తః-అప్రాప్తవత్ అవిద్యా పరమాత్మ తనౌనికిని మనకు తెలియచేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు, కాని మన అవిద్య అడ్దుగోడై నిలుస్తూనే ఉంటుంది ఆ శివానందలహరీ ప్రవాహపు జోరుకూల్చివేసేదాకా. తన వంతుగా శంకరయ్య ,మనము అనే ఇనుము-మహాదేవుని కరుణ అనే అయస్కాంతము వైపు ఆకర్షింపబడాలో-తాను ఇప్పటివరకు నమ్మిన సిద్ధాంతమునకు కట్టుబడి ఉండాలో తెలియక సందిగ్ధములో కొట్టుమిట్టాడు తోంది. కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ. 'తన్మై మనః శివ సంకల్పమస్తు వాచే మమశివపంచాక్షరస్తు మనసే మమ శివభావాత్మ మస్తు". పాహిమాం పరమేశ్వరా. (ఏక బిల్వం శివార్పణం)

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)