PRAPASYANTEE MAATAA-06
ప్రపశ్యంతీ మాతా-06
*******************
యాదేవి సర్వ భూతేషు ఛిన్నమస్తక రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః.
పనసపండు ముళ్ళతో మనకు దర్శనమిస్తుంది.తొనలు చూస్తే మధురమే.సీతాఫలము కళ్ళతో కనిపిస్తుంది కాని లోపల మధురమే.రూపము కొంచము ఇబ్బంది కరముగా నున్నప్పటికి అర్థము చేసుకోగలిగితే ఇష్టమైనదే అవుతుంది.తేజస్సును రేణువులుగా విభజించి కాంతిసంవత్సరమును (మిల్కి వే)
సృష్టించి,అది అథోముఖముగా పయనించుటకు
మార్గమును ఏర్పరచి,స్థూల విశ్వము దానిని గ్రహించుటకు తన కట్లను విప్పుకుని పైపైకి ఎగబాకి అమృతధారలను తాను ఆస్వాదించుటయే కాక అఖిలజగమును అమృతమయము చేయించగల శక్తి ఛిన్నమస్తక దేవి.తల్లి వర్గీకరణను నాడీవ్యవస్థ ద్వారా మనకు పరిచయము చేయుచున్నది.యుక్తాయుక్తముతో కూడినది ఈ వర్గీకరణ.పైనుండి
కురియుచున్న అమృతధారలను అందుకోవాలన్న-ఆస్వాదించాలన్న పైకెగిరి పట్టుకోగలగాలి.విశ్వము అమృతమయము కావాలంటే నిరోధములు లేని నిచ్చెన వంటి ఊర్థ్వ మార్గము కావాలి.పట్టు తప్పకుండా ఉండాలి లేకుంటే పడిపోవుటయే కదా.అందులకు విశ్వ మార్గము వజ్రాయుధము వంటి గట్టితనమును కలిగియుండాలి.పైన పట్టుకోగలవారుండాలి అందుకే తల్లి తేజోశక్తిని రశ్ములుగా కిందకు జారుటకు వీలుగా చేసి తద్వారా పైకి ఎగిరి పట్టుకునే ప్రయత్నము చేయుచున్న వాటికి ఫలితమునందించుచున్నది
.నింగి-నేలల రాకపోకలకు నిచ్చెనగా తన శక్తినుంచినది.అంతేకాదు భూసారములను సౌరశక్తులు గ్రహించునట్లు మార్గమునేర్పరచినది.మాయ చుట్టుముట్టిన సమయమున తల్లి దానిని వేరుచేసిచూపుతుంది.దానివలన సత్యము నిత్యమై నిండుదనమును సంతరించుకుంటుంది.అమృతపానము చేసి,అమ్మ శక్తిని చాటుతుంది.ఆ మాయను తొలగించుకొనుటయే శిరము నుండి కపాలమును వేరుచేసుకొనుట.అట్లు విడివడిన సమయమునందును తల్లి స్వయం సమృధ్ధయై తన మీదనే కాక డాకిని-వర్ణిని)తన పక్కన ఉన్న రెండు శక్తులమీదను అమృత ధారలను అందించగలదు.దీనిని "మధు విద్య" అంటారు.మధువిద్య యైన తల్లి స్థూల ప్రపంచ కుండలిని ద్వారా శీర్షము నుండి కపాలమును ఛేదించుకొని,బ్రహ్మాందమంతా వ్యాపించియున్న దేవయాన మార్గము ద్వారా ఏకత్వము చెందుతుంది.అప్పుడు విశ్వము-విశ్వేశ్వరి అను రెండు నామరూపములుండవు.విశ్వమే విశ్వేశ్వరి.విశ్వేశ్వరియే విశ్వము.ఏకం అద్వితీయం బ్రహ్మం గా మారుతుంది.సత్వగుణ సంపన్న శుష్మ్న నాడిగా తల్లిని కనుక భావించినట్లయితే పక్కనున్న రెండు శక్తులు రజో-తమోగుణముల ప్రతీకలనుకోవచ్చును.
సూక్ష్మ పరిశీలనకు వస్తే తల్లి మన నాడీమండలము లోని వెన్నెముక.సుషుమ్న నాడి
తన పక్కన ఇడ-పింగళ అను రెండు నాడులను కలుపుకొని,మార్గములో వచ్చే చక్రాలలో ఉన్న బ్రహ్మ-విష్ణు-రుద్ర గ్రంధుల ముడులను విప్పుకుంటూ పైపైకి పాకి అసత్యమైన ఐహికమును-సత్యమైన ఆధ్యాత్మికత నుండి వేరు చేసుకొని,మాయ అను పొరతో కప్పుకొని యుండిన శిరము లోని నిత్యసత్యమను ఆత్మను తెరచి,అమృతపానము చేస్తూ ,అనిర్వచనీయానందములో మునిగి ఉంటుంది.సత్తు-అసత్తులను వేరుచేసి,స్వస్వరూపమును సందర్శింపచేయుచున్న చిద్విలాసిని ఛిన్నమస్తాదేవి.శరణు-శరణు.
ధన్యోస్మి మాతా ధన్యోస్మి.
Comments
Post a Comment