NAMMAALWAR

  అదివో-అలదివో-నమ్మాళ్వారు
   ****************************
 సంభవామి యుగే యుగే సాక్ష్యములు  హరి  పాదుకలు
 ధర్మ సంస్థాపనమే  లక్ష్యమైన మన ఆళ్వారులు

 తిరునగరిలో కొలివీరి ఉదయనంగ  దంపతులకు
 మారన్ గా ప్రకటితమాయెను శ్రీహరిశఠగోపురము

 కనుతెరువడు-ఏడువడు-పాలను స్వీకరించడు
 వింతగ చింతచెట్టు తొర్రలో పద్మాసనుడాయెను

 ఉత్తర  దక్షిణ దిక్కుల ఉజ్జ్వలించు జ్యోతులుగ
 మధురకవితో  ప్రథమముగ  మాటలాడినాడు
 నాలుగు వేదములను తమిళ తిరుగ్రంథములుగ రచించి
 నాలుగు దిక్కుల హరితత్త్వమును  అందించెగ

  నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మదినిలుపుకొని

  పరమార్థము చాటిన "నమ్మాళ్వారు"  పూజనీయుడాయెగ.





  నమ్మాళ్వారు అంటే మన ఆళ్వారు.కురుగురుంగుడి గ్రామములో సంతానమునకు నోచుకోని కరి-ఉదయనంగై అను వెల్లాల దంపతులు,వారి క్షేత్రదైవమైన వామన మూర్తిని ప్రార్థించగా,ప్రసన్నుడైన స్వామి తన పాదుకలను (శఠారిని)వారికి పుత్రునిగా అవతరింపచేసెను.బాలుని దివ్యతేజమును గమనించి వారు వానికి "మారన్" అను పేరుపెట్టిరి.ఆళ్వార్ తిరునగరి గా పెరుగుచున్న బాలుడు కన్నులు తెరుచుట లేదు.పాలను స్వీకరించుట లేదు.బాహ్యాపేక్షను వీడి భావనామగ్నుడాయెను.



   చిత్రమైన పరిస్థితి కలిగించుచున్న చింతను తీర్చగలవాడు ఆదినాధుడేనని వారు బాలుని స్వామి ఆలయముదగ్గర నున్న చింతచెట్టు క్రింద ఊయలలో పరుండబెట్టి,హరిచరణములే శరణమని తరలినారు.




  ఆ చింతచెట్టు సామాన్యమైనదికాదు.సాక్షాత్తు ఆదిశేషుడేస్వామి అంశను అర్చించుకొనుటకు అవతరించినది.దానికి జరామరణములు లేవు.ఆకులు పచ్చదనమును-పండు పక్వతను ఎన్నటికి కోల్పోవు.







   "అంతయు నీవే హరిపుండరీకాక్ష-చింత ఏల మాకిక చిద్విలాసా" అను సూక్తిని నిజముచేస్తూ,బాలుడు చేతనుడై చెట్టుపైకి పాకి,తొర్రయందు పద్మాసనస్థుడై తిరిగి నిశ్చల జ్ఞానమగ్నుడైనాడు.



  కాలస్వరూపము తన పనిని తాను నిర్వర్తిస్తూ పదహారు సంవత్సరములను దాటినది.కాని బాలుని నిశ్చలధ్యానములో కదలిక ఏమాత్రమును లేదు.కౌస్తుభధారి ఏ అద్భుతమునకు ఆహ్వానమును అందించనున్నాడో?ఎన్నడు ఆళ్వారు గళమున మంగళములను పాడించనున్నాడో?





   మారన్ కంటే ఎన్నో సంవత్సరములకు ముందే ఉత్తరభారతమున జన్మించిన మధురకవి ద్వారా నమ్మాళ్వారు జ్ఞానగంగా ప్రవాహమైన వాక్ఝరిని వదలదలచినాడా అన్నట్లుగా,పుణ్యక్షేత్రములను దర్శించి-పుణ్యాత్ముల సాంగత్యమును పొందవలెనను కోరికను మధురకవికి కలుగచేసినాడు.దీపంజ్యోతి పరంబ్రహ్మ-దీపేన సాధ్యతే సర్వము.అంతే కదా జ్యోతిస్వరూపుడై గగన మార్గమున దిశానిర్దేశము చేస్తూ,మధురకవిని,మన ఆళ్వారున్న చింతచెట్టు క్రిందికి తెచ్చి చేర్చాడు.




  పద్మపత్ర విశాలాక్ష-పద్మనాభ సురోత్తమ-మధురకవి,




  పద్మనాభుని నేత్రములను పోలిన మన ఆళ్వారు నేత్ర సందర్శనాభిలాషియైనాడు.సందర్శనాభిలాషియే కాదు.సంభాషణాభిలాషి

 కూడ యైనాడు.వారధిని కట్టుటకు ఉపయోగబడిన రాళ్ళు వాదనను అందించుటకు సిధ్ధమైనవా అన్నట్లుగా,అక్కడి పెద్ద రాయిని ఎత్తివైచి,పెద్దశబ్దము ద్వార ధ్యానభంగమును కలిగించుటకు ఉపక్రమించాడు మన మధురకవి.



    నయనం మధురం-హసితం మధురం-సకలం మధురం-స్మరణం మధురం. 

   తరువాత జరుగబోయే అద్భుతమును మధురకవి ద్వారా తెలుసుకుందాము.



   ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణం.





.




Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)