TIRUPPAAVAI-09



తూమణి మాడత్తుచ్చుత్తం విళక్కెరియ
తూపం కమళత్తుయిలణైమేల్ కణ్వళరుం
మామాన్ మగళే! మణిక్కదవం తాళ్తిరవాయ్
మామీర్! అవళై ఎజుప్పీరో ఉన్మగళ్ తాన్
ఊమైయో అన్రి చెవిదో అనందలో
ఏమపెర్రుందుయిల్ మందిరప్పట్టాళో
మామాయన్ మాధవన్ వైగుండన్ ఎన్రెన్రు
నామం పలవుం నవిన్ర ఏలో రెంబావాయ్ .
ఓం నమో నారాయణాయ-9
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
వేద సం రక్షణార్థము " వేదాంతవేద్యుడైన"
జలచరమై జయమొసగిన "మత్స్యావతారములో"
"ధర్మ సంస్థాపనకు" క్షీరసాగర మథనమైన
ఉభయచరమై ఉద్ధరించిన " శ్రీకూర్మావతారములో"
" పరమపునీత భూమాత" అసురహస్తగతమైన
అమ్మను రక్షించిన " ఆదివరాహరూపములో"
"దశేంద్రియములు మేల్కొలుపు" దశావతారములైన
వివిధరూపములు ధరించిన " విరాట్రూపములో"
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
పరిశుద్ధమైన మణిసదనములో ఆదమరచి నిదురించుచున్న గోపిక స్వామిసేవకు సిద్ధముకాలేదని,పిలుచుచున్నను మేల్కొనుటలేదని,అమె పక్కనున్న తల్లిని మేలుకొలుపమని,వైకుంఠవాసా-మాధవ అని కీర్తించుచు పూజకు తోడ్కొనవలెనని గోదాతో కూడిన గోపికలనుచున్నారు ఇది బాహ్యార్థము.ఆంతర్యమును అవలోకించగలిగితే ఆళ్వారుల అంశయై గోపిక యోగనిద్రలోనుండి బహిర్ముఖము కాక తనలో తాను రమించుచు ధన్యతనొందుచున్నది. .
( దశ,శత,సహస్ర మొదలగు శబ్దములు సంఖ్యను తెలియచేటయే గాక విశేషార్థములో లెక్కలేనన్ని అనికూడా సూచించు చున్నవి."దశ" అను శబ్దమునకు పది అను సంఖ్యవాచకము మాత్రమే కాకుండా ధర్మమును రక్షించే స్థితి అను అర్థమును ఆర్యులు సెలవిచ్చారు కదా!ఉదా దశ తిరుగుట-స్థితి మారుట.) నాలుగు వేదములను కాపాడిన స్వామి చేప అవతారములోను,మంధర పర్వతమును మునుగకుండ కాపాడిన తాబేటి అవతారములోను,భూమాతను రక్షించిన ఆదివరాహస్వామి లోను,నాలోని దశేంద్రియముల (జ్ఞానేంద్రియములు 5,కర్మేంద్రియములు 5) బాధ్యతను తెలియచేయుచున్న స్వామి మూలరూపమునందు నిమగ్నమైన నా మనసు,పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను స్వామికి సమర్పించుటకు చెలులారా! కదిలి రండి. తెల్లవారుచున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

Comments