IYARVAGAI NAAYANAR



" అహం ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుః
న వా సప్తధాతు ర్నవా పంచ కోశాః 
నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ
చిదానంద రూపః శివోహం శివోహం ."
చిదానందరూపా-ఇయర్వగై నాయనారు
*************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
శివుడు బ్రాహ్మణ వేషములో ఇంటిముందు నిలిచాడు
ఇంగితమును విస్మరించి నాయనారు ఇల్లాలిని అడిగాడు
లేదనుమాట పలుకలేనివాడైన ఇయర్వగై నాయనారు
నివేదనమనుకున్నాడు, నిజపత్నిని పంపించాడు
బ్రాహ్మణునకు-భార్యకు బాటలో బాసట తానైనాడు
అడ్డువచ్చిన వారిని ఎదురొడ్డిన వాడయ్యాడు
శర్వునకు నమస్కరించి నిశ్చయ భక్తితో వెనుదిరిగెనుగా
నిర్వాణమునందీయగ భార్యయే కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
కావేరి పట్టణ వాసుడైన ఇయర్వగై నాయనారు నరనరాల్లో దాతృత్వమును జీర్ణించుకొన్న గొప్పశివ భక్తుడు.శివ భక్తులను శివ స్వరూపముగాభావించి,అడిగిన దానిని దానమిచ్చి,వారి సంతోషమే పరమేశ్వర అనుగ్రహ విశేషముగా భావించి,సంతసించెడివాడు.
జీవుడు దేవుడు కావాలంటే శివుడు ఎన్ని పావులు కదపాలో-ఎన్ని కథలను నడపాలో.ఆ రావణ బ్రహ్మకు ఆలినిచ్చిన దాత కదా.వేరొకరి ఆలినికోరగా యాచకుడిగా మారదలచాడు." ఓం నమః శివాయ" త్రిపుండ్ర ధారియైనాయనారు ఇంటిముందు నిలిచాడు.శివ స్వరూపము అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించారు నాయనారు దంపతులు.చల్లకు వచ్చి ముంతను దాచటమెందుకని చల్లగా సంభాషణలో నాయనారు అడిగినది లేదనక ఇస్తావట.నిజమేనా అని సందేహముగా అడిగాడు.స్వామి నా దగ్గర ఉన్నది అయితే తప్పకుండా ఇస్తాను అన్నాడు అమాయకంగా ఇయర్వగై.నీ భార్యను కోరుతున్నానన్నడు.వెంటనే సంశయించక అందుకు అంగీకరించినాడు.పతివ్రతా శిరోమణి పరమప్రీతితో యతి సేవకు సిద్ధమయింది.
పినాకపాణి పిరికితనమును నటిస్తూ నాయనారు భార్యను తనతో తీసుకువెళతానని,దారిలో ఎవరైనతనను అడ్డగించవచ్చని,కనుక వారిద్దరు ఊరు దాటువరకు రక్షణగా నాయనారును తోడు రమ్మన్నాడు. ఆయుధధారియై వారిని అనుసరించాడు.అడ్డువచ్చిన వారినిచూసి బెదిరిన బ్రాహ్మణునితో నాయనారు భార్య మీరు భయపడవలదు.నా భర్తవారిని మట్టికరిపించి,మనలను క్షేమముగా పొలిమేర దాటిస్తారని సెలవిచ్చింది.బలిచక్రవర్తి వలె స్వామిచేయి క్రింద-నాచేయి దాతగ పైన అని ఆనుకోని నాయనారు మాటకు కట్టుబడి, అడ్డువచ్చిన వారిని ఓడించి,వీరిద్దరిని అనుసరించుచుండెను.
తిరుచ్చైకాడు దేవాలయము దగ్గర శివుడు నాయనారును తిరిగి వెళ్లిపొమ్మనెను.కొంత దూరము వెళ్ళినాడో లేదో నాయనారు అని గట్టిగా పిలిచి అదృశ్యమయ్యాడు శివుడు.వెనుతిరిగిననాయనారుకుభార్యఒక్కతే కనిపించింది.పార్వతీ పరమేశ్వరులు దీవించారు.త్రికరణ శుద్ధిగా ధర్మపత్నిని శివునకు సమర్పించిన ఇయర్వగై నాయనారును కటాక్షించిన పార్వతి పరమేశ్వరులు మనందరిని కటాక్షించెదరు గాక
( ఏక బిల్వం శివార్పణం.)

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)