PASURAM-01

పాశురం-01 ********** ఆదియుం అందముం ఇల్లారుం పెరుం శోదియై యాం పాడ కేట్టేయుం వాల్కడంగళ్ మాదే వళరుదియో వన్సెవియో నిన్సెవిదాన్ మదేవన్ వార్కళంగళ్ వాళ్తియ వాళ్తోళిపోయ్ వీధివాయ్ కేట్టిలియో విమ్మి విమ్మి మెయ్ మరందు పోదార్ అమలి ఇమ్మేల్ పురండిగన్ ఏదేను మాగాళ్ ఎడుందాన్ ఎన్నే ఎన్నే ఈదే ఎంతోళి పరిసేలో రెంబావాయ్. పరంజ్యోతియే పోట్రి. *************** తిరు మాణిక్యవాచగరు మొదటి పాశురములో సంకీర్తనా భక్తిని సన్నుతిస్తూ,వ్రతమునకు సిధ్ధమవుతున్న కన్నెలు తమ చెలిని నిద్దురలేపుటకు వచ్చినారు. వారికి మరికొందరు స్వామియొక్క స్వరూప-స్వభావ సంకీర్తనము వీనుల విందుగా వినిపిస్తున్నది. ఆ సంకీర్తనము ఎంతటి సౌశీల్యమును కలిగినదంటే అది , వాల్ ఒళిపో-ప్రతిధ్వనించుచున్నది. వీధివాయ్-వీధి అంతా తన నోరు తెరుచుకుని కీర్తిస్తున్నదా అన్నట్లుగా శివనామము, స్వామి స్వరూపమును , అరుం-అద్భుతమైన, పెరుం-బహు పెద్దదైన,విస్తీర్ణమును కొలుచుటకు సాధ్యము కాని , స్వభావమందువా ఆదియుం-అంతముయుం, మొదలు చివర కనలేని/కనరాని అనగా, ఆద్యంతరహితుని,దివ్య చరణారవిందములను, వార్కళల్-పాదపద్మములను ప్రస్తుతిస్తున్నది. మాదే! వాళ్ తడంగల్ మాదే! చురకత్తుల వంటి కన్నులు కలిగిన ఓ చెలి! నీవు ఇంకా, వళదెరియో? నిదురిస్తున్నావా? ఇంకా మేల్కొనలేదా? వాళ్దియ -స్వామి సంకీర్తనము నీ చెవికి సోకడము లేదా? లేక నీవు విన్సెవియా-చెవిటిదానివా? లేక, మన్సెవియా? నీ చెవి సంకీర్తనమును అందించుచున్నప్పటికిని,దానిని లెక్క చేయుటలేదా/పెడచెవిని పెడుతున్నావా? అనవరతము శివనామధ్యానములో ఉండే నీవు ఇప్పుడు,ఈ పోదార్ అమలి ఎమ్మేల్-పూలసుగంధముతో గుబాళించుచున్న ఈ తల్పము వైపునకు నీ దృష్టిని మరల్చి,ఆదమరచి నిదురించుచున్నావా? పురండిగన్-ఇంద్రియములకు వశమై,నిన్ను నీవు మరచినావా ఎన్ తోళి-నా సఖియ ఈదేన్-ఇదేమి నీ వింత వైఖరి ఎడుందాన్ ఈ తమో నిద్రను వీడి ఎంపావై-మనము చేయుటకు తలపెట్టిన వ్రతమునకు పరిసేలో -సిధ్ధముగా. ఎన్నే ఎన్నే-అన్ని విధములుగా బాహ్యాంతరములను స్ధ్ధము చేసుకుని మాతో బయలుదేరు చెలి అని నిదురిస్తున్న పడుచును మేల్కొలుపుతున్నారు. వారు స్వామి సంకీర్తనమును వినిన ఇంకొక చెలి ఏ విధముగా తాదాత్మ్యమును చెంది తన్మయత్వముతో ఎక్కి ఎక్కి, విమ్మి-విమ్మి -ఎక్కి ఎక్కి ఏడుస్తూ, మెయ్ మరందు-తనను తాను మరచి, నేలసోలినది. కడు విచిత్రము స్వామి ధ్యాసలో నున్న ఆమెకు కటికనేల సుగంధభరిత సుమ శయ్యగా మారినది. అంటూ మొదటి చెలిని తమతో కలుపుకుని,రెండవ చెలిని నిదురలేపుటకు బయలుదేరారు. మనము కొంచము లోతుగా ఈ పాశిరము మనకు చెప్పదలచుకున్న విషయమును గురించి కనుక ఆలోచిస్తే, ఇక్కడ మనకు ఇద్దరు చెలుల ప్రస్తావన వచ్చినది. పూల పానుపు ప్రస్తావన వచ్చినది. ప్రారంభములో నున్న పూలపానుపు,పూల పరిమలములు ఐహికములకు సంకేతములు.ఆమెను ,ఆమె ఇంద్రియములను వశపరచుకొని,తమోగుణ ప్రభావితురాలను చేసినవి.అందుకే ఆమెకు చురకత్తుల వంటి కన్నులను కలిగియున్నప్పటికిని,వాటిని మూసుకుని,సాధనకు ఉపయోగించలేకున్నది. మనము సైతము మనకు స్వామి అనుగ్రహముచే ప్రాప్తించిన ఉపాధిని సద్వినియోగము చేసుకొనలేక పోతే అజ్ఞానమను నిద్దురను వీడలేము.బహిర్ముఖమును దాటలేము. రెండవ చెలి తన చెవులతో స్వామి సంకీర్తనమును వినగలిగినది.వినినదానిని తన కన్నులద్వారా చూడగలిగినది.వినినదానిని-చూసినదానిని తన మనసు ద్వారా అస్వాదించకలిగినది.అంతర్ముఖమైనది.బాహ్యమును అధిగమించినది. మహదేవుని అనుగ్రహమును ఆస్వాదించని అజ్ఞానమును వీడి మానవ ఉపాధిని మహేశుని పాదసేవకు ఉపయోగపడనీయమని తిరు మాణిక్యవాచగరు సులభోపాయమును అందిస్తున్నారు. అంబే శివే తిరువడిగళే పోట్రి.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)