JAI SREEMANNAARAAYANA- 27


 కూడారై వెల్లుం శీర్ గోవిందా!ఉందన్నై
 పాడిపఱై కొండు యాం పెరుసన్మానం
 నాడు పుగళం పరిశినాళ్ నన్రాగ
 శూడగమే తోళ్వళియే తోడై సెవిప్పువ్వే
 పాడగమే ఎన్రనైయ పల్కలనుం యా మణివో
 ఆడైయడు ప్పోం అదన్ పిన్నే పాల్ శోరు
 మూడనెయ్ పెయ్దు  ముళంగై వళివార
 కూడి ఇరుందు కుళిరుందు  ఏలో రెంబావాయ్.

  ఓం నమో నారాయణాయ-27

విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది

గాజులు-కడియాలు చీరెలు-సారెలుయైన
శ్రీహరి దీవించుచున్న దీర్ఘ సుమంగళములో

కర్ణిక చుట్టిన రేకులు కన్నని గోపికలైన
పెరుమాళ్ళుకు తినిపించే పెద్ద సన్మానములో

వేళ్ళసందు నంజుడున్న "భ్రాజిష్ణు: భోజనం భోక్త" యైన
ఎంగిలి భోజనాల కూడారై పాశురములో

చల్దులారగింప వేగ చెలులారా రారె
ఆముక్త మాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె

భావము

మన గోపికకు స్వామి కరుణతో పోతన భాగవత తత్త్వము ప్రసాదింపబడి కూడారై ప్రసాద-పాశుర విశిష్టతను వివరించగలుగుతోంది.

"కమలాక్షునర్చించు కరములు-కరములు" రీతిలో మనగోపికలు స్వామిని ప్రసాదించమన్నవి సౌభాగ్యములు.

స్వామిని పద్మమునకు కర్ణికగా,గోపికలను చుట్టిన రేకులుగా "జలజాంతస్థిత"
దర్శించడము జ్ఞానానికి సంకేతము.

అసలు కూడారై అంటే ఏమిటి? ప్రసాదము అనుకుంటే అది బాహ్యమా లేక ఆధ్యాత్మికమా?

పాలతో కలిసి ఉడికిన బియ్యము మధురమును పూర్తిగా కలుపుకుని నేతిలో పూర్తిగా మునిగిపోయిన ప్రసాదము" కూడారై" ( బాహ్యమునకు )

గోపికలు ప్రసాదమును తినునపుడు వారి మోచేతిదాకా నెయ్యి కారవలెనని అమ్మ ప్రార్థించినది.ఏమిటి దీని అంతరార్థము?

పాలు స్వచ్చమైన స్వామి గుణగణములు .బియ్యము స్వామి సాహచర్యముకోరు నిశ్చలభక్తి .వాటిని ఉడికించునది స్వామి సాంగత్యమును కోరు ,భక్తుల తపన అనెడి అగ్ని .ఉడికిన పాలు-బియ్యమునకు స్వామి అనుగ్రహమను మథురము తోడైనది.భక్తుని-భగవంతుని విడతీయలేని లేహ్యమైన నెయ్యి. పూర్తిగా పదార్థమునురుచిలో(తాదాత్మ్యతలో) ముంచి వేస్తోంది. ..నెయ్యిమోచేతివరకు పొంగి పొరలుట నవనీతుని దయసంద్రము పొంగి పొరలుట.ఎప్పటికిని భక్తుని భగవంతుని కలిపి ఉంచగల అవ్యాజ ప్రేమయే ఆ ఆజ్యము.

ఈ సందర్భములో మనము ఆండాళ్ తల్లి యతిరాజ సోదరిగా కీర్తింపబడే విశేషమును ముచ్చటించుకుందాము.తల్లి స్వామి కూడారై ప్రసాదమును స్వీకరించినట్లైతే, 108 గుండిగల ప్రసాదము సమర్పిస్తానని,నెరవేర్చుకొనలేకపోయినది.రామానుజాచార్యులవారు అన్నగా ఆ బాధ్యతను తాను స్వీకరించి శ్రీ రంగములోని స్వామికి అమ్మ అన్నమాట ప్రకారము సమర్పించారు.అమ్మ సంతోషించి రామానుజ సోదరిగా "యతిరాజ సోదరి"గా కీర్తింప బడుచున్నారు.

మనుషులు విరక్తులు-తటస్థులు-అనురక్తులు అను భక్తి విషయములో విభజింపబడతారు.దేవుడులేనే లేదనువారు విరక్తులు.తానే వచ్చి రక్షిస్తాడనుకునే వారు తటస్థులు.క్షణమైన స్వామిని విడిచి ఉండలేనివారు అనురక్తులు.(మన గోపికలు)

"భ్రాజిష్ణు: భోజనం భోక్తా" ఆహారమును సృజించువాడు-ఆహారము-ఆహారమును భుజించువాడు మూడు పరమాత్మనే.ఆ స్వామి వేళ్ళ సందున ఊరగాయిని నంజుడికి పెట్టుకుని,గోపబాలులు ఇంటినుండి తెచ్చుకున్న చద్దిని,ఆకులపైననో,చేతులలోనో తీసుకుంటు,పక్క వాడి ముద్దను వాడిచేతినుండి లాక్కొంటు,వాడేడిస్తే ఇంకొకడి చద్దిని పెడుతూ,ఎగురుతూ,ఆడుతూ-పాడుతూ,గిల్లికజ్జాలతో,వారిని ఊరిస్తూ,వారితో మమేకమై ఆనందిస్తు, ఆనందింప చేస్తూ,తాను ఆనందమై వారిని అనుగ్రహించుచున్న శ్రీ కృష్ణభక్తురాలిగా మన గోపికను భావిస్తు, నా మనసు అమ్మవెంట చల్దులారగించుటకు బయలుదేరుచున్న గోపికలతో బాటు తన అడుగులను కదుపుతోంది.

( ఆండాళ్ తిరు వడిగళే శరణం )

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)