SAUNDARYA LAHARI-84

 సౌందర్య లహరి-పురుహూతికాదేవి

 పరమ పావనమైన నీపాద రజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 వృతాసురుని వధించిన పాతక పరిహారమునకు
 పురుహూతుడు చేసెను కఠినమైన తపస్సు

 ప్రసన్నమైనది తల్లి-పురుహూతికగ మారినది
 పవిత్రుడైనాడు గయుడు విష్ణువర ప్రభావమున

 హవిస్సులను ఆపినాడు-విచక్షణను వీడినాడు
 గయుని యజ్ఞవేదికగా కోరిరి శివకేశవులు

 మాయాసతి పీఠము మహిమాన్వితమైనది పిఠాపురము
 పాదగయలో నా పాదము పావనమగుచున్నవేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.

    "పురుహూత సతి మాత పీఠికాపురు సంస్థిత
     పుత్రవాత్సల్యతా దేవి భక్తానుగ్రకారిణి"

    రాక్షసరాజైన గయుడు విష్ణుభక్తుడు.ఘోరతపముచేసి విష్ణువుని ప్రసన్నముచేసుకొనెను.తన శరీరము ఆపాదమస్తకము సకల తీర్థక్షేత్రములకన్న అతి పవిత్రము కావించమని వరమును ప్రసాదించమని కోరి,అతి పవిత్రుడయ్యెను.ఆ వర ప్రభావముచే పంచమహా పాతకములు గయుని శరీరస్పర్శచే పటాపంచలయేవి.సకలచరాచరములు గయశరీర స్పర్శచే ముక్తిని పొందెడివి.పుణ్యఫలముగా  గయాసురుడు ఇంద్రత్వమును పొందెను.'కాలగతితో నడిచే బుద్ధి"పెడతోవ పట్టింది.అందుకే "బుద్ధి కర్మానుసారిణీ అని అంటారేమో.గయుడు దేవతలకు ఆహారముకావలిసిన యజ్ఞ హవిస్సును వారికి అందనీయకుండా తానే స్వీకరించ సాగెను.దేవతలు నిస్తేజులు కాసాగిరి.త్రిమూర్తులు ఋషివేషధారులై గయుని సమీపించి ,గయుని ప్రసన్నుని చేసికొని,అతని సంతోషమునకై ఒక వరమును కోరిరి.తాము ఒక బృహత్తర యజ్ఞమును సంకల్పించినామని,పవిత్ర శరీరము,మనము కలవారే యజ్ఞవాటిక కాగలరని,
  దృఢదీక్ష గలవారే యజ్ఞము పూర్తియగు వరకు నిశ్చలముగా ఉండగలరని గయుడు అందులకు తగినవాడని తలుచుచున్నామనిరి.గయుడు ఆ దీక్షకు సంతసముగా అంగీకరించెను.వారు పూర్తియైనదని  చెప్పకముందు గయుడు కదిలినచే అతని శరీరము వివిధ ఖండములగునని హెచ్చరించిరి.షరతును గయుడు అంగీకరించగా యజ్ఞమును ప్రారంభించిరి.యజ్ఞ సమయమున గయుని శరీరము కదలసాగెను.అప్పుడు బ్రహ్మ వివిధ శిలలను అడ్డుపెట్టగా గయుడు వానిని తోసివేసిన,  అవి రామ పర్వతము-ప్రేత పర్వతముగా భూమిపై నిలిచాయని అంటారు.అప్పుడు బ్రహ్మగారు మరీచి మహాముని శాపము వలన మహాపతివ్రత దేవవ్రత శిలను గయుని తలపై పెట్టెను.పాతివ్రత్యమును గౌరవించు గయుడు కదలలేదు.  


విష్ణువు ఇచ్చిన వరమును గయుడు పొందవలసిన సమయమాసన్నమగుటచే, పరమేశుడు వ్రతసమాప్తికి ముందగనే కోడిరూపమును దాల్చి కొక్కొరొకో అని కూయసాగెను.యజ్ఞము పూర్తి అయినదనుకున్న గయుడు కదలగానే నియమ ప్రకారము అతనితల వివిధ
  ఖండములై పాదములు మాత్రము ఆ ప్రదేశములో ప్రకాశించుచుండెనట.కోడిని కుక్కుటము అనికూడా అంటారు.భక్తులపై మిక్కుటముగా కరుణగల స్వామి
  కుక్కుటేశ్వరుడై కొలువబడుచున్నాడు.

    పూర్వము అమ్మవారిని లక్ష్మీరూపముగాను,అంబారూపముగాను భావించు రెండు వర్గములవారు  "పద్మధారియైన పురుహూత లక్ష్మిని సమయాచార ప్రకారము,పురుహూతాంబిక అని వామాచార ప్రకారము ఆరాధించేవారట.అమ్మ వారి పూజలను ఆనందముగా స్వీకరించుతు,ఇంద్రుని నామమును తాను ధరించి అనుగ్రహించిన,పురుహూతికాదేవి నా కలవరమును తొలగించుచున్న సమయమున చెంతనే నున్న,నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు. 


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)