SAUNDARYALAHARI-85

సౌందర్య లహరి-మణిక్యాంబ-81
పరమపావనమైన నీపాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
తుండి-నాట్య గణపతులు ఉండగ ద్వారములముందు
యోగినిగా అమ్మవారు-భోగముతో శంకరులు
దక్షుని నిరీశ్వర యాగమును కటాక్షమున సంస్కరించి
పంచభూత సమతౌల్యమైన పంచారామము చేసిరి
భీమేశ్వరునికి నిత్య సూర్యకిరణాభిషేకములు
చల్లబరచగ సాగును గోదావరి ఏడుపాయలుగ
మాయాసతి ఎడమబుగ్గ మహిమాన్విత దక్ష వాటికగా
మాణిక్యాంబ మాతృత్వముతో మనలను బ్రోచువేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
" ద్రక్షావతి స్థితశక్తి విఖ్యాత మాణిక్యాంబికా
వరదా శుభదా దేవి భక్త మోక్ష ప్రదాయిని."
పంచభూతములు సమతౌల్యమును పాటించు పవిత్ర ప్రదేశము " ఆరామము." అమరా రామము,ఖీరా రామము,సోమారామము,భీమారామము,దక్షారామము పంచారామములు..ఆరామము అనగా అతిమనోహరము అను అర్థము కూడాకలదు పార్వతీ పరమేశ్వరులు కైలాసము నుండి,కాశికి ,కాశి నుండి దక్షారామమునకు విచ్చేశారని స్థలపురాణము చెప్పుచున్నది.దక్షుడు నిరీశ్వర యాగము చేసిన ప్రదేశము తిరిగి భీమేశ్వరునిచే సంస్కరించబడినది కనుక దక్షారామము అని పేరు వచ్చినదని చెబుతారు.దక్షప్రజాపతి పుత్రిక దాక్షాయణి పేరుతో దాక్షాయిణి పురమని కూడా పిలుస్తారు.కాలక్రమేణ ఆరామము ఉద్యానవనముగా వ్యవహరింపబడుచున్న దక్షపీఠిక త్రిలింగ క్షేత్రములలోను ఒకటి.
అతి పొడవైన భీమేశ్వరస్వామి లింగము రెండు భాగములుగా ద్యోతకమగుతు,రెండస్థుల దేవాలయములో దేదీప్యమానముగా దీవెనలను ఇస్తుందట.తుండి గణపతి-నాట్య గణపతి ద్వారపాలకులుగా స్వాగతించు ఈ దేవాలయము వేంగీ రాజైన భీమునిచే పునర్నిర్మింపబడినదని అంటారు. సూర్యభగవానుడు నిత్యము అతిపొడవైన భీమేశ్వర స్పటిక లింగమును అభిషేకించెడివాడని,అభిషేకము తరువాత
సప్తర్షులు సైతము ఆ వేడిని భరించలేక,సమీపించలేక పోయెడివారని,పరమేశుడు వారిని అనుగ్రహించి,గోదావరినదీ ఏడుపాయల జలముతో చల్లబరచుకొనుచు వచ్చి తమను సేవించుకొనమని సెలవిచ్చాడట.అందు వలన ఏడుపాయలుగా చీలిన గోదావరి సప్తగోదావరిగా ప్రసిద్ధికెక్కినది.అందులో భరధ్వాజ,జమదగ్ని,విశ్వామిత్ర ఋషుల తపోశక్తులు అంతర్లీనముగా ప్రవహిస్తూ పవిత్రమగుతాయట.,ఆర్తత్రాణ పరాయిణిగా మాణిక్యాంబ మనలను అనుగ్రహించుచున్న సమయమున చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)