NAH PRAYACHCHANTI SAUKHYAM-17
****************************
భగవంతుడు- భక్తుడు మీడుష్టులే
సంపదలను వర్షించువారే.
"మీడుష్టమ శివతమ శివోనస్సుమనా భవ"
మిక్కిలి శాంతము గలిగినవాడు శివతముడు.అంతేకాదు భక్తులపై వారి కోరికలను అమితముగా వర్షించు రుద్రునకు నమస్కారములు.
" నమో బృహతేచ-వర్షీయసేచ" సద్గుణ సంపన్నుడై సంపదలను గుణములను వర్షించువానికి నమస్కారములు.
కుబేరుడు సదాశివుని ముందు చేతులు కట్టుకొని నిలబడతాడట.ఎవరా కుబేరుడు? ఏమా కథ? కుబేరునికి సంపదలను వర్షించిన కపర్ది మాకు సౌఖ్యమును ప్రసాదించుము.శివోహం.
ఉత్కళరాజ కుమారుడైన దమనకుడు పరమ శివభక్తుడు.పూర్వజన్మల సంస్కారమును పుణికిపుచ్చుకొన్నవాడు.గతజన్మల గురుతులతో తన గమ్యమును తెలిసికొని ,గంగాతీరమున శివలింగమును ప్రతిష్టించుకొని ప్రార్థించుచుండెడి వాడు.
" నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే" స్వామి నీవు సహస్రాక్షుడవు.అనంతదర్శన శక్తిసంపన్నుడవు.జగత్కళ్యాణమునకై గరళమును కంఠమునందుంచుకొనిన నీలగ్రీవుడవు.భక్తుల మనసెరిగి వారికి శుభములనందించు కృపావర్షుడవు.నా మనసెరిగి నన్ను నీదరి చేర్చుకో తండ్రీ అని అచంచల భక్తివిశ్వాసములతో అభిషేకించుచుండెను.
" నమో శంభవేచ-మయోభవేచ" అంటూ మరి మరి స్తుతులు చేసేవాడు.క్షిప్ర ప్రసాదుడైన భోళాశంకరుడు ప్రత్యక్షమై,దమనకునికి దివ్యశరీరమునిచ్చి "కుబేరుడు" అని పేరుపెట్టెను.ఉత్తర్దిక్కునకు అధిపతిని చేసి ఆశీర్వదించెను.అవధులు పొంగిన అనురాగము అంతటితో ఆగక శివుడు తన సంపదలను కుబేరునకు అందించి,దానినీర్హులైన వారికి అందీయమని ఆనతిచ్చినాడు.
కుబేరుడు వినయవిధేయతలతో స్వామి కార్యమును సమర్థవంతముగా నిర్వహిస్తూ," ద్యుమ్నే వాజే భిరాగతం" స్వామి మీరు ధనమును అన్నమును కూడిన వారై రండి అని ప్రార్థించాడు.
భక్తుని విషయానికొస్తే తిరుమునైప్పాడి ప్రాంతముననరసింగమునైయార్ అనురాజు నిత్యశివభక్తుడు.అంతేకాకుండ శివభక్తులను శివస్వరూపములుగా భావించి,అర్ఘ్యపాద్యములనించ్చి,అతిభార బంగారునాణెముల మూటను సంభావనగా ఇచ్చి సంతృప్తిని పొందెడివాడు." " ఓం నమః శ్లోక్యాయచ-అవసాద్యాయచ" సర్వేశ్వరా వైదిక మంత్రములందును వేదాంతమునందున్న చైతన్యము నీవే చిదానందా చిరంతభక్తిని ప్రసాదించుము స్వామి.నీ దాసానుదాసుని కరుణించుము దక్షగర్వభంజనా అని అదే ధ్యాసలో ఉండేవాడు.
పవిత్ర ఆరుద్రనక్షత్రమును అత్యంత వైభవముగా జరిపించెడివాడు.ఆర్ద్రనిండిన స్వామి జీవిత పరమార్థమునీవేనంటు నిష్కాముడై నీలకంఠుని కొలిచేవాడు.
ప్రసన్నతను పొందవలెనన్న పరీక్షను అధిగమించవలసినదే కదా.ప్రశ్న-జవాబు ధ్వని-ప్రతిధ్వని కారుణ్యము-కాఠిన్యము ఘోరము-అఘోరము అనీ తానైన స్వామి భక్తులకు పరీక్షలలో భగవత్తత్వమును లోకవిదితముచేయుటకు
అడుగులు కదపసాగాడు ఆ రుద్రుడు.బాహ్య-అభ్యంతరశుచియై.మూడుకన్నులవాడు నాయనారుతో ఆడుల్కోవాలనుకున్నాడు.విచిత్రవేషమన విపరీతముగా బూడిదను పూసుకున్నాడు.వింత వస్త్రములను ధరించాడు.కొంత తెలిసి-మరికొంత తెలియనివాని వలె నాయనారు చెంతచేరాడు.ఘోరేభ్యో-అఘోరేభ్య్శ్చ నమోనమః.విచిత్ర అతిథిని చూసి వింతగ బుగ్గలు నొక్కుకున్నారు వాని బుగ్గిపూతలను చూసి.సిగ్గుఎగ్గులేని వాని సరసను కూర్చునటకు కాని,వానితో మాటలాడుటకు వారికి మనస్కరించలేదు.సరికదా గేలిచేయసాగారు మాయను గెలువలేనివారు.
" యద్భావం-తద్భవతి" హరోమ్హర.అవ్యాజకరుణాసింధు అనుగ్రహించినావా ఆదిదేవ అంటూ అతిథిని అయంత భక్తితో ఆహ్వానించాడు." ఓం నమో అగ్రియాయచ-ప్రథమాయచ" అని స్తుతిస్తూ అర్ఘ్యపాద్యములను సమర్పించాడు.గంగాధర అంటూ
అభినివేశముతో అభిషేకముచేశాడు.చంద్రధ్హరికి చందన సమర్పణగావించాడు.త్రిగుణాతీతునికి బిల్వార్చన చేశాడు.అంధసస్పతికి కడుపునిండా అన్నముపెట్టి,తాంబూలాది సత్కారములతో పాటుగా ద్విగుణీకృతమైన బంగరు నాణెములమూటను సంభావనగా సమర్పించి,సాష్టాంగ నమస్కారములు చేస్తున్నాడు నాయనారు.
" నమోనమః అనిర్హతేభయః" సకలజీవుల సర్వపాపములను సమూలముగా హరించివేయు సర్వేశ్వరా ఇక్కడివారినందిరిని కరుణించుము స్వామి అని ప్రార్థించాడు.శివభక్తుని సంతోషపరచుట శివకర్తవ్యముగా అనుకొని స్వామి వారిని పునీతులనుచేసెను.అంతే కాకుండా నరసింగ నాయనారునకు కైవల్యమును ప్రసాదించి,కైలాసవాసిని చేసెను.కరుణసింఢువైన స్వామి మనలను అనుగ్రహించుగాక.
స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.
( ఏక బిల్వం శివార్పణం)
( ఏక బిల్వం శివార్పణం.)
Comments
Post a Comment