kamakshi-kamadayini-04
శ్రీ మాత్రే నమః
*************
బూమియిల్ పిళ్ళయాయ్ పిరందు వలందు నాన్ పేరాన స్థలము అరియేన్
పెరియోర్గళ్ దరిశనం ఒరునాళం కండునాన్ పోట్రి కందాడి అరియేన్
వామి ఎండ్రెన్నై శివగామి ఎండ్రెసొల్లి వాయినాల్ పాడి అరియేన్
మాతాపితా నినదు పాదత్తె నానుమె వనగి కొండాడి నరియేన్
స్వామి ఎండ్రెసొల్లి సద్రుదన్ కైకాపి చరణంగళ్ సైదు అరియేన్
సద్గురువు పాదారవిందైగళై కండు సాష్టాంగ దండ నరియేన్
ఆమింద బూమియిల్ ఆశయిన్ పోన్ మూఢ ఆశనీ కంద దరిదేన్
అళగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే,
**********
భూలోకమున ఎన్ని జన్మలెత్తినగాని ఏ క్షేత్రములు చూడలేదు
సత్పురుషులను దర్శించి భక్తితో వారిని ప్రస్తుతించినదియు లేదు
వామి నీవని, శివగామి నీవని తల్లి నిన్ను నోరార కీర్తించలేదు
మాతా పిత యనుచు పాదములు తాకి నే వందనము చేయలేదు
జ్ఞానులను గుర్తించి జాగరూకతతోడ సవినయ కైమోడ్పులీయలేదు
సద్గురువు పాదాలపై వాలి సాష్టాంగములు చేయలేదు
పరికించి చూచినను నా వంటి మూఢుడు
నీకెందు కానరాడు
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.
************
అమ్మ ఆశీర్వచన భాగ్యమేమో ,ఈ విభాగములో సాధకుడు చేయవలసిన పనులను ప్రస్తావిస్తూనే,తాను చేయలేకపోయాననే పశ్చాత్తాపముతో పరమేశ్వరిని కరుణించమని పరిపరి విధములుగా ప్రాధేయపడుతున్నాడు.పుణ్యక్షేత్రముల,సత్పురుషుల,సద్గురువుల,జ్ఞానుల,మాతాపితల ఔన్నత్యమును కీర్తిస్తున్నాడు.వారిని గౌరవించవలసిన కనీస మర్యాదను తెలియచేస్తూ,కనువిప్పులేక తాను వాటిని నిర్వర్తించలేదని తనను తాను నిందించుకుంటున్నాడు.
వామి నీవని-శివగామి నీవని అను ప్రస్తావన వచ్చింది కనుక మనము ఒకసారి "నటరాజ పత్తు" లోని ఇదే విషయమును ఒకసారి ముచ్చటించుకుందాము.
"కడివెండ్ర పువిమీదిల్ అలయెన్ర ఉరుకొందు కనవెండు వాళ్వనంబీ"
పరమేశా! ఈ భూమి అనే సముద్రములో నిరంతరము కేరింతలు కొడుతున్నప్పటికిని తన ఉనికికి మూలము సముద్రమని గుర్తించలేని అలవలె,
తాయెండ్రు-సేయెండ్రు-నీయెండ్రు-నాయెండ్రు తమియేనే విణ్నవిట్టూ
తల్లని-పిల్లలని-నీవని-నేననని మాయ యనే సుడిగుందములో చిక్కుకొని,
ఉండుండు ఉరంగువదె -కండదె ఎల్లాదు,
నిద్రాహారములనుచు,
ఇరవు-పగలు- రేయి పవలు నేను మునిగియున్నవేళ,
ఇడైయెన్రు-కడైయెన్రు ఏడెండ్రు కేళాది రుప్పమన్ నడకాలమో?
నేను ఆ విధముగా అజ్ఞానములో ఎందుకున్నానని నన్ను ప్రశ్నించకుండుట నీకు న్యాయమేనా?
అని అయ్యను ప్రశ్నిస్తున్నాడు సాధకుడు
తనకున్న చనువుతో.
అమ్మను నిలదీస్తున్నాడు మన సాధకుడు నా మూఢత్వము గురించి తెలిసియు నన్ను హెచ్చరించక ,సవరించక ,కనికరించక ఉండుట నీకు తగనిదమ్మా అంటున్నాడు.
పెద్దలు మనకొక చిన్న ఉదాహరణతో సత్పురుషుల-జ్ఞానుల-సద్గురువుల -క్షేత్రములను మార్గదర్శకములుగా,మహిమోపేతములుగా ,కీర్తిస్తారు.
కన్ను దర్శనశక్తి కలిగిన ఇంద్రియమే అయినను తనను తాను చూడలేదు.అంతేకాదు తనను అనవరతము రక్షించుచున్న కనురెప్పను చూడలేదు.మనము మన కన్ను తనను-తన కనురెప్పను చూడవలెనన్న దానికి (కన్నాడి) అద్దము అవసరము.అదేవిధముగా భక్తుని-భగవంతుని అనుసంధానముచేసే వారే పైన చెప్పిన సత్పురుషులు-సద్గురువులు-జ్ఞానులు-మాతాపితలు.లోకకళ్యార్థము వారు ధర్మమును ఆచరిస్తూ ,సకల లోకములను భగవతి పాదములను చేర్చగల పరికరములుగా మారతారు
మన్మధునికి విజయమును అనుగ్రహించిన,కాంచి క్షేత్రములో కొలువైన మాత కామాక్షి,
దివ్య తిరువడిగళే శరణం.
నరియ నరియ వణక్కంగళ్
అమ్మ చేయి పట్టుకుని వెళుతు రేపు విరుత్తములోని ఐదవభాగమును గురించి తెలిసికొనే ప్రయత్నమును చేద్దాము.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.
.
Comments
Post a Comment