DANDI ADIGAL NAYANAR

దండి అడిగళ్ నాయనారు ********************* బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం. ఏ సంకేత రూపముగా నున్న పరమాత్మ లింగమును బ్రహ్మ విష్ణువు మొగిలిన దేవతలు అర్చింతురో,నిర్మలమైన ఏ లింగము సకల చరాచర జన్మలకు ముడిపడియున్న కర్మపాశములను విడదీసి,దుఃఖములను నశింపచేయునో అట్టి సదాశివునికి నా నమస్కారములు. ******** చోళదేశములో తిరునావూరులోని పరమ శివభక్తుడు దండి అడిగళ్ నాయనారు. అడిగల్ పాదపద్మములు-పరమేశ్వర పాదపద్మములను దండిగా అపరిమితముగా నమ్మిన వాడగుటచే దండి అడిగళ్ గా కీర్తింపబడుచున్నాడు.వారు సార్థకనామధేయులే సదాశివునికి ప్రియమైన వారే. దండి అడిగల్ బాహ్యమునకు అంధుడు.అంతర్దర్శనశక్తిమంతుడు. కన్ను తక్క నాలుగు ఇంద్రియములను స్వామిసేవకు మిక్కిలి ప్రేమతో సమర్పించే సమర్థుడు. స్వామి లీలలు వినుచు తన శ్రవణేంద్రియమునకు సౌఖ్యమును కలిగించేవాడు. స్వామిని తాకుతు స్పర్శను పరవశమొందించేవాడు. సామి కరుణ యను సుగంధములను ఆఘ్రాణించుచు ఆనందపడేవాడు .పరమేశుని గుడి చుట్టు ప్రదక్షిణములను లక్షణముగా చేస్తూ మురిసిపోయేవాడు. నిర్మలమైన తన మనసులో నీలకంఠుని దర్శిస్తూ,స్మరిస్తూ,పూజిస్తూ, నిశ్చితగానుండు సత్వగుణశోభితుడు.నాయనారు. పొంచియున్న పరీక్షా సమయము మదాంధులతో వారు తలచుచున్న అంధునితో తలపడుటకు తరలివచ్చినది తన పని తాను చేసుకొనిపోవుటకు. నందివాహనుని ఆనకు వినోదమునకు తాను సిధ్ధమైనది కటాక్షమునకు కారణముగా గుడి పడమట వైపునున్న తటాకము. . శివద్వేషులుగా బాహ్యమునకు శివకార్య నిర్వాహకులుగా ఆంతర్యమునకు సిధ్ధమైనారు జైనుల రూపములో నున్న రాజ సేవకులు. ఇంకెందుకు ఆలస్యము అన్నట్లుగా శివుని కోవెలకు సంబంధించిన చెరువును పూడ్చుటకు కుప్పలుకుప్పలుగా మట్టిని పోసే పని ప్రారంభమయింది.శంభుని మాటను వింటూ. అందరు చేసేదిలేక నిస్సహాయముగా చూస్తున్నారు. గుసగుసలాడుకుంటున్నారు చూపులేనివాడని అజ్ఞానము భావించే.నాయనారు చెవివరకు చేరింది చెడువార్త. అడ్డుకొనుటకు దొడ్డతనము ముందుకువచ్చింది.కపర్దికి కావలిసినది కూడా అదేకదా .ఆటను ప్రారంభించాడు పోటీ రూపములో అజ్ఞానమునకు-జ్ఞానమునకు. ఆడిస్తున్నాడు మూడుకన్నులవాడు.వేడుకుంటున్నాడు వేడుక తెలియనివాడు. ఒక కర్రను. తాడును తీసుకుని చెరువు దగ్గరకు వచ్చాడు దండి అడిగల్. చెరువు మధ్యలో ఒక కర్రను పాతాడు.కాసేపు మనము దానిని ఇహము అనుకుందాము.భక్తి అనే తాడు ఒక కొసను దానికి గట్టిగా కట్టాడు. .రెండవ కొసను కట్టుతకు పైపైకి ఆధ్యాత్మికము వైపుకి తడుముతకుంటూ, తడుముకుంటూ రెండవ కొసను చేతిలో పట్టుకుని నడుస్తున్నాడు . స్వామి కృప వానిని జరుపుతు-జరుపుతు గట్టుమీద ఉన్న రెండవ స్తంభము వైపునకు గుట్టుగా చేరుస్తున్నది.పట్టుకుని దానిని తన చేతిలో నున్న తాటి రెండవ కొసను గట్టిగా కట్టాడు నాయనారు.స్వామిని స్మరిస్తూ..స్మరిస్తూ.. శివ పాదము మీద నీ శిరమునుంచరాదా భవసాగరమీద దుర్భర వేదన లేదా శివ శివ శివ అనరాదా శివ నామము చేదా? ఎంతఓ ఎంతో ఎంతో రుచిరా అనుకుంటూ, ఎంతటి పరమాద్భుతము. గట్టు మీద నున్న స్తంభమునకు బిగించిన తాడు తాను పట్టును సడలించక తటాకములో పెట్టిన కర్రకు ఊతముగా మారినది.ఊదిపూతల వాని కనుసన్నలలో. విరాజమానుడు బహువిధములుగా దాసోహమనుచు ఒక వైపు మదాంధులనుంచి మట్టిని తట్టలతో వేయిస్తూ పూడిపిస్తున్నాడు తటాకమును పగటిపూట.. మరొక వైపు నిశియు తానైన వాడు (నాయనారు)కసిగా తట్టల తట్టల మట్టిని గట్టుకు చేరుస్తూ పూడికను తీసివస్తున్నాడు తడబడక తడుముకుంటూ. చీకటితో పాటుగా శివద్వేషమును కూకటివేళ్ళతో సహా తొలగించే ప్రయత్నములో రాటుతేలుతున్నది గుడ్డి భక్తి. చెరువు పగలు తాను మట్టిలో మునుగుతూ రాత్రి నాయనారు సేవకు సాక్ష్యముగా మారినందుకు సంతోషపడుతు చిద్విలాసుని లీలకు ఆవాసమైనది. ద్వంద్వ యుధ్ధమును నిర్ద్వంద్వముగా జరిపిస్తున్నాడు నీలకంఠుడు. ఫలితమును చూపించవలసిన సమయమునకు సూచనగా పసన్నత తాను సిధ్ధమవుతూ,పరీక్షకు పరిహాసమును ముందు పంపినది. అడిగళ్ ఆంతర్యమును తెల్లబరచుటకా యన్నట్లు తెల్లవారినది. గమనించని నాయనారుని పనిలో నిమగ్నుని చేసినది. కాదనగలవారెవరు కామేశుని ఆనను. కదిలివచ్చినది అహంకారముతో కూడిన అజ్ఞానము శివద్వేష వేషముతో. నాయనారుని సమీపించి నానా దుర్భాషలను పలికించింది.గుడ్డివాడా! ప్రాణాపాయకరమైన పనులను ఎందుకు చేస్తావు? కళ్ళుకనిపించవు కదా! పోయి ఒక మూల కూర్చోక?అంటూ అవహేళనను చేయించింది. ఘోరేభ్యః-అఘోరేభ్యో నమోనమః. రౌద్రరూపములోనున్నవానికి-శాంతరూపములో నున్న వానికి నమస్కారములు. కాముని వైరి, పంచేంద్రియములతో ఇతరులను వంచించు వారికి మంచి సమాధానమీయదలిచాడేమో? నాయనారు పొంచియున్న క్రోధము వాగ్రూపముగా ముంచెత్తుకొని వచ్చింది. మునుపెన్నడు పరుషములు మాటాదని వానిని విపరీత పౌరుషమునకు దాసుని చేసి, "నాదం తను మనిశం" వానిచే, నా స్వామి కరుణామయుడు అనుట కనుక నిజమే అయితే, ఆశ్రిత రక్షకుడూ అని అనుకొనుట సత్యమే అయితే, శివుని నమ్మిన వారు ఎన్నటికిని చెడిపోరు అన్న సూక్తి శాశ్వతమే అయితే, మీరు భావిస్తున్న నా అంధత్వమును స్వామి తొలగించి,మిమ్ములను అంధులను చేయుగాక అని అనిపించినది. భక్తుని మాట ను నిలబెట్టే భారము భగవంతునిదే కదా. కాదనలేడను నమ్మకమును కలిగించుటకు కదిలి వచ్చాడు అమ్మతో సహా నాయనారు నమ్మకమునకు చిరస్థానమును కలిగిస్తూ.చక్షువులతో పాటుగా మోక్షమును ప్రసాదించుటకు. దూషించిననవారికి పోయినవి చర్మచక్షువులు.పశ్చాత్తాపముతో ప్రణమిల్లిన ఫలితముగా క్షిప్ర ప్రసాదుని కరుణచే లభించినవి చర్మ చక్షువులతో స్వామి మర్మమును తెలియచేయు జ్ఞాన చక్షువులు.సూరదాసును నందగోపాలునిగా తరింపచేసిన పరమాత్మ ,మన నాయనారుని నందివాహనునిగా సాక్షాత్కరించి మహదానంద భరితుని చేసాడు.రాజు అజ్ఞానమును స్వప్నదర్శనముతో తొలగించాడు. ఆశ్రిత రక్షకా! అన్నీ నీవే-అంతానీవే అనుచు, అందరి ప్రస్తుతులనందుకొను చున్న సదా శివుడు మనలనందరికి కంటికి రెప్పవలె కాపాడును గాక. కార్తిక ఏకాడశి-సోమవారము కాలకంఠుని కరుణను వర్షించును గాక. ఏక బిల్వం శివార్పణం..

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)