SAKTI NAYARAR

శక్తి నాయనారు ************* కృపాకటాక్ష అక్షర స్వరూపునకు దండాలు శివా ప్రకటిత ప్రకాశ యజ్ఞదీక్షితునకు దండాలు శివా నందివాహనుడు చిదానందమునకు దండాలు శివా సద్గతి ప్రసాదక భక్త మందారకునకు దండాలు శివా ***** శక్తి నాయనారు పరింజియార్ గ్రామమునకు సంబంధించిన భూస్వామి.పరమ శివభక్తుడు.శివడమరుక అనుగ్రమైన అక్షరములను సలక్షణముగా గౌరవించే వాడు.నిక్షేపములైన అక్షరములను ఆక్షేపిస్తూ ,దుర్భాషలాడిన వారిని శిక్షించక వదిలేవాడు కాడు. అసలే వ్యవసాయ పాండిత్యమున్నవాడేమో,లక్షణ అక్షర సేద్యమునకు కంకణ బధ్ధుడైనాడు. దానికి కారణము నాయనారుకు శబ్ద ప్రాశస్త్యము పై గల అవగాహనయే.సాక్షాత్ తాను నమ్మిన శివుని శబ్ద స్వరూపమే వాక్కుగా భావించేవాడు.దాని ప్రయాణమును ను ప్రమాణముగా స్వీకరించేవాడు. సకల చరాచర జగత్తులో వాక్కు సలక్షణముగా నున్నప్పటికిని ,సమస్తమునందు సంపూర్ణముగా నుండదను విజ్ఞుల అభిప్రాయా నుసారము , రాళ్ల యందు వాక్కు పరా రూపంలో ఉంటుంది, వృక్షాదులయందు పశ్యంతీ రూపంలో, పశువులయందు మాధ్యమా రూపంలో, మానవుని యందు వైఖరీ రూపంలో వ్యక్తమౌతోంది అని విశదీకరించబడింది. అయితే, కేవలము మానవుడి యందే ఈ నాలుగు దశలు కనిపిస్తాయి. సృష్టి లోని మిగతా వాటి వద్ద ఒక్కొక్క దశ మాత్రమే కనిపిస్తుంది. అందుకే 'చత్వారి వాక్పరిమితా' అన్నారు. ఎవరు జ్ఞానులో వాళ్ళు ఈ వాక్ తత్త్వాన్ని తెలిసికోగలరు. నాలుగవదశ ను దాటి వచ్చిన వాక్కును మానవులే పలకగలరు. ఆ విధంగా పూర్ణత్వం మానవ శరీరంలో ఉంటుంది కనుక పురుషుడు / పూర్ణుడు అన్నారు మానవుణ్ణి. అట్టి ఉదాత్త వాగ్వైభవమును ఈశ్వరుని అనుగ్రహముగా పొందిన మానవుడు ఇంద్రియములచే ఆకర్షింపబడి,అధీనుడై,దుర్వినియోగపరుస్తుంటే సహించలేని నాయనారు ,వారి నాలుకను కత్తిరించివేసే దీక్షను చేపట్టాడు. భాషణమునకు సహాయపడే ముఖ్య ఇంద్రియము నాలుక.అదియును ఒక్కొక్కసారి యుక్తాయుక్త విచక్షణను మరచి,విజృంభిస్తుంటుంది.కనుక నిందిస్తున్నావారికి సహకరించే జిహ్వను కత్తిరించుటకు కారణము,దానిని అంతకు ముందు ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికిని తన పధ్ధతిని మార్చుకోక రెచ్చిపోవటమే. సామ-దాన-భేద ఉపాయములను ధిక్కరించి,దండనను ఆహ్వానించుటయే. కనుక దుర్భాషలాడుటకు సహకరించిన నాలుకను కత్తిరించుట,కలుపుమొక్కను సమూలముగా పీకివేసి,సస్య కేదారములను సంపన్నముచేయుట అని తలచేవాడు నాయనారు. ఎవరైనను రుద్రాక్షలు ,విభూతి పుండ్రములు ధరించకున్నప్పటికిని, సదాచార సంపన్నులు కాకపోయినప్పటికిని,,రుద్రాభిషేకములు చేయకపోయినప్పటికిని వారిని విమర్శించకుండ ఉండగలుగు సంస్కారము కలిగిన వాడు,నాయనారు శ్రవణేంద్రియము మాత్రము శంభుదూషణుని క్షమించలేని కఠినత్వము కలది.భావములను భాషగా మార్చుటలో సహకరించుచున్న నాలుకను కత్తిరించివేయకుండా ఉండలేనిది. "శివనాథు వర్ణించు జిహ్వజిహ్వ"-దాని నియమము.అన్యము అనర్థదాయకమనుచు ,దానిని తీసివేసే మోటుదనములో దీటులేనిది. ఇది బాహ్యమునకు మనకు కనిపించుచున్న దృశ్యము. కాని నిశితముగా పరిశీలిస్తే పరమపూజ్యుడైన నాయనారు,అన్నమయ్య కీర్తించినట్లు, భావములోన-బాహ్యము నందున గోవింద-గోవింద అనికొలువవే ఓ మనసా అనుటకు నిలువెత్తు నిదర్శనము. అత్తినాయనారు-సత్తి నాయనారు-శక్తి నాయనారు అని సన్నుతించుటలోని ఆంతర్యమును కొంచము పరిశీలిద్దాము. అత్తి అనగా వటవృక్షము-ఆళ్వారుళచే అత్తి వరదరాజ స్వామిగా కీర్తింపబడు వటపత్రసాయికి ఆసనమైనది.అంటే శాశ్వతమైనది.మన నాయనారు సైతము అత్తి వృక్షమువలె అతిపవిత్ర శాశ్వతత్త్వముతో అలరారువారు. -ప్రళయానంతరము జగన్నాధుని సేవించినది. "సత్తము" అను తమిళ పదము శబ్దము అను అర్థమును తెలియచేస్తుంది.తీయ సత్తము అను పదమును దుర్భాషగా కనుక అన్వయించుకుంటే, దుర్భాష వెలువడుటకు సహాయపడిన నాలుకను అనగా మూలదోషమును నిర్మూలించు స్వభావము కలవాడు సత్తి నాయనారు . మూడవ నామము శక్తి నాయనారు. శక్తి అను పదమును ఆయుథము అను అర్థములో కనుక అన్వయించుకుంటే,భక్తి అనే కత్తితో(శక్తితో) భవబంధములను తుంచివేయువాడు అని అనుకోవచ్చును.బాహ్యమునకు హింసాప్రవృత్తిగా అనిపించినప్పటికిని,మాటలలోని దోషములను మొగ్గలోనే తుంచివేయుటలో మొగ్గుచూపునది. పరమేశ్వరుని సన్నిధిచేరుటకు తన కఠినత్వము ద్వారా, . వాచాలత్వమునకు వీడ్కోలు ఇస్తూ, " కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం ' అన్న సత్యమును జగద్విఖ్యాతము చేసిన శక్తి నాయనారును అనుగ్రహించిన సదాశివుడు మనలను సర్వవేళల సంరక్షించును గాక. ఏక బిల్వం శివార్పణం.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)