VIRAALMINdA NAAYANAARU
విరాల్మిండ నాయనార్
********************
"ధావతే సత్వానాం పతయే నమః"
భక్తులను రక్షించుటకు భక్తుల వెనుక ,భక్తులతో పాటుగా,భక్తులచే తరుమబడుతూ లీలలను ప్రదర్శించు శివునకు నమస్కారములు.
విరాల్ మిండ విశ్వమంతా పరమాత్మయే అను భావమును నమ్మువాడు.భగవంతునికి మిత్రుడు అన్న అర్థమును కూడా చెప్పుకుంటారు.
విరాల్మిండా నాయనారు చేర రాజ్యములోని,చెంగన్నూరులో వ్యవసాయ భూస్వాముల కుటుంబము నందు జన్మించెను.
విరాల్ మిండ అనగా సకలజీవులు సర్వేశ్వరుడే అను నమ్మువాడు.భగవంతుని సేవించాలంటే,దర్శించాలన్నా,భక్తుని అంతే భక్తిప్రపత్తులతో సేవించాలన్న నియమము కలవాడు.
శివార్చన ఎంతటి మహాభాగ్యమో శివభక్తార్చనయు అంతే అని నమ్మువాడు.
విరాల్మిండ యొక్క భక్తితత్పరతలను విశ్వవిఖ్యాతము చేయదలిచాడు విశ్వేశ్వరుడు.శివపుణ్యక్షేత్ర సందర్శనమనే మిషను కల్పించి నాయనారును ఉన్నచోటునుండి కదిలించాడు.
ఉన్న స్థితి నుండి ఉన్నతస్థితికి చేర్చదలచిన ఉమాధవుని కరుణ ఊహాతీతము కదా.
హర హర మహాదేవ శంభో శంకర
మహద్భాగ్యమునందించుటకు తిరువారూరు లోని త్యాగరాజ కోవెలను రంగస్థములనుగా సిధ్ధపరిచాడు ముందుముందు త్యాగరాజుగా నాయనారుచే తరుమబడాలన్న ముచ్చపడ్డ ముక్కంటి.
సుందరారుకు అందమైన బాధ్యతను అప్పగించాడు చేయవలసినపనికి ప్రేరణముగా.
సమయము వేచిచూస్తున్నది శివుని మాయను చూడటానికి వేయి కళ్ళతో.
సందర్భము తొందరపడుతోంది ముందుముందుకు జరుగుతూ.
అతియారు/శివభక్తి తత్పరులు తహతహలాడుతున్నారు తపఃఫలముగా ధన్యతను పొందాలని దేవాశ్రయ మండపములో తమదైన రీతిలో.
ప్రవేశించాడు విరాల్మిండ వినయముతో.పరవశించాడు అతియారులను చూసి నిశ్చలమతితో.
సభక్తిపూర్వక నమస్కారములను చేశాడు.తనివితీరా దర్శిస్తూ తత్త్వమును సంభాషించాడు.సంతుష్టాన్రంగుడవుతున్న సమయములో రానే వచ్చాడు సుందరారు హడావిడిగా.
భక్తి ఒక్కొక్కసారి చక్కని రూపుని దిద్దుకుంటూ,భక్తునిలోని పంతమును అమాంతము పెంచుట తనవంతు అనుకుంటుంది.
నిప్పుకన్ను వాని ఆనను తప్పదు కదా.
నాయనారు మనసులోనికి ప్రవేశించి,తన పనిని తాను చేసుకుపోతున్నది శివమాయ.
సుందరారు హడావిడి తప్ప అన్యమును ఆలోచించనీయ కుండా చేస్తున్నది.
త్యాగరాజ మండపము లోని అతియారులను సుందరారు దర్శించలేదు.పూజించను లేదు.అసలు పట్టించుకోనేలేదు.
స్వామి దర్శనమునకై సరాసరి పరుగులు తీస్తున్నాడు.
ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు బేసి నవ్వులవాడు.గుస గుసలు మొదలైనవి విరాల్మిండ మనసులో.
పసలేని భక్తుడు సుందరారు అంటూ,కసి కసిగా క్రోధము ముందుకు వచ్చింది నాయనారు మనసులో నుంచి మాటలుగా.
అది సుందరారు నియమపాలన ధిక్కారమో లేక,
విరాల్మిండకు జరుగబోవు సత్కారమో,
అదియును కాక ఆదిదేవుని చమత్కారమో
ఏమనగలవారము ఏలినవాడి కరుణను
శివోహం-శివోహం.
సుందరారును-సుందరారు తప్పిదమును క్షమించిన సుందరారును తాను మాత్రము క్షమించలేనని,ఆ స్థలమును-స్వామిని తిరిగి దర్శించనని పంతముతో,వందైపలై లో శివభక్తునిగా,సకల ఉపచారములను చేస్తూ ,సమారాధనలను చేస్తూ ,స్వగతములో మాత్రము తన పంతమునకు సాయముచేస్తూ ఉన్నాడు నాయనారు.
సుందరారు తేవారములను సుమధురములుగా మనకు అందించాలనుకొన్నాడు ఆ సుందరేశ్వరుడు.నేరుగా అడిగేకన్నా,నేర్పుగా అందించాలని పరీక్షగా, ఒకనాడు అన్న సంతర్పణకు తిరువారూరు నిండి త్యాగరాజుగా విరాల్మిండ ఆతిథ్యమునకు వచ్చాడు భక్తుని విడిచి ఉండలేని తండ్రి.
విరాల్మిండ తిరువారూరు నుండి వచ్చిన వారికి ఆథిధ్యమును తిరక్స్రించుటయే కాక కష్టపెట్టి కసితీర్చుకునే వాడు పరమసాధ్వీమణి అయిన నాయనారు ధర్మపత్ని పతిని ఎదిరించలేక వచ్చిన వారికి హితము చెప్పి వెనుకకు పంపించేది.
ఆ తల్లి త్యాగరాజును కూడా వివరములడిఘి విషయమును వివరించి,వెనుదిరిగి పొమ్మని వేడుకుంటున్నది.
విననే విన్నాడు విరాల్మిండ.పంచేండ్రియములు ఎంతటి పుణ్యమును చేసుకున్నావో మించిన కరుణ వాటిని ముంచెత్తుతోంది.
కన్ను తన వంతుగా వచ్చిన త్యాగరాజుని చూపిస్తోంది.వాక్కు తన వంతుగా పరుషములను పలికిస్తోంది.స్పర్శ వానిని పట్టుకొమ్మని ఉసిగొల్పుతోంది.
భస్మాసురుని బారిన పడిన వాని వలె భవుడు దవుడు తీస్తున్నాడు.భక్తుడు వానిని పట్టుకుని మట్టుపెట్టుటకు వెంబడిస్తున్నాడు.
చుట్టుకున్న మాయ గట్తుదాటి పోతున్నది.
నాలోన శివుడు గలడు-నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు
లోకంబులేల గలడు కోరితే శోకంబు బాపగలడు."
చిదానందరూపా- విరాల్మిండ నాయనారు
ఎంతసేపు పరుగులుతీశారో-ఎంతమందిని అనుగ్రహించారో,ఎవరికి తెలుసు.
పొలిమేరదాటాడు విరాల్మిండ త్యాగరాజును వెంబడిస్తూ.
అద్భుతము.మహాద్భుతము.పరమాద్భుతము.
పారిపోతున్న త్యాగరాజు పరమేశ్వరునిగా ప్రత్యక్షమయ్యడు.
పాహి-పాహి అని సన్నుతిస్తూ,సందరారు తో కలిసి అంత్యము వరకు అర్చిస్తూ,ధన్యుడైనాడు విరాల్మిండ నాయనారు
.
నాయనారును అనుగ్రహించిన నటరాజు మనలనందరిని తప్పక అనిశము కాపాడును గాక.
ఏక బిల్వం శివార్పణం.
Comments
Post a Comment