KANAPULLA NAAYANAARU
కణుంపుల్ల నాయనారు
**********************
నమో శుష్కాయచ హరిత్యాయచ
పచ్చి గడ్డి/పచ్చి కట్టెల రూపములో,
ఎండుగడ్డి/ఎండు కట్టెల రూపములో నున్న శివునికి నమస్కారములు.
గడ్డిని కోసి,మోపులు కట్టి అమ్మి వచ్చిన డబ్బులతో శివభక్తునిగా ఖ్యాతిని గాంచిన,పుల్లరెక్కు వల్లూరులో జన్మించిన కణంపుల్ల (గడ్డిమోపు) నాయనారునకు నమస్కారములు.
నాయనారు పచ్చిగడ్దిని కోసి,మోపులులను తలపైకెత్తుకుని,అమ్మి,వచ్చిన పైకముతో జీవించెడివాడు.
దర్భలను వత్తులుగా మలచుకొని అగ్నికార్యములను ఆచరించుచు,ఆనందముగా శివనామ సంకీర్తనమును చేయుచు నుండెడివాడు.
నాయనారు వైదిక పూజావిధానమునకు ఆటంకమును కలిగించాలనుకున్నాడు వైదీశ్వరుడు.
పరీక్షను నిర్వహించడానికి కరువుకు గడ్డి మిగలకుండా చేశేలా ఉత్తరువులను జారీచేసాడు.
మారుమాటాడకుండా గడ్డి
పరకలను మాయము చేసేసింది. గడ్డు సమస్యకు శ్రీకారమును చుట్టింది.
నమో నమో ఉలప్యాయచ
అనేకరకములైన గడ్డిజాతులలో నిండియున్న నిటలాక్ష నమస్కారములు.
సమిధలకు,వత్తులకు అగ్నికార్యములకు అతిముఖ్యమైన గడ్డి,దుర్వారములు కనుచూపుమేరలో కానరాకుండా రాబోవు/కాబోవు స్వామి సేవగా,
" వైరాగ్య తైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే
ప్రబోధ పూర్ణపాత్రే తు జ్ఞప్తి దీపం విలోక్యయేత్"
పరమేశ్వరా నీ ఉనికిని-ఉత్కృష్టతను తెలుసుకోగల /దర్శించగల/భావించగల/భాషించగల/ జ్ఞానమును ద్వరా మోక్షమను నీ పాదసన్నిధిని చేరుటకై,
బుధ్ధి అదియును ప్రకృష్టమైన బుధ్ధి యను పాత్రనందు,వైరాగ్యమను తైలమును/నూనెను పోసి,భక్తియనే వత్తిని దానిలో ముంచి,జ్ఞానమనే దీపజ్వలనమునకై ప్రయత్నించుచున్నాను.
ఓ తిమిర సంహార నీ అనుగ్రహమనే ఆలంబనముతో దానిని అఖండముగా ప్రకాశించనీయి అంటూ తనదగ్గర నున్న సామాగ్రితో వెలిగించినాడు
వెలుగు నీడలు రెండును తానైన శూలి ఆ దీపమును రెపరెపలాడించి కొండెక్కించేసినాడు.
వెండికొండ దొర నిండైన కరుణను వెదజల్లుటకు కదలబోతున్నాడేమో.
నాయనారు మనసు చాలా నొచ్చుకున్నది.ముచ్చటగా వెలగవలసిన దీపమునకు చిచ్చు సహకరించకున్నది.చిమ్మ చీకట్లను కమ్మేస్తున్నది.కిమ్మనకున్నాడు నమ్మినవాడు.
నాయనారు నిరాశపడలేదు.
'హరికేశునికి" దీపారాధనమునకు తనకేశములను వట్తిగా మలిచాడు.వైరాగ్యతైలములో ముంచాడు.
'అగ్నా విష్ణూ సజోష " అంటూ చమకమును ప్రారంభించాడు.
ఏ విధముగా అగ్ని-విష్ణువు ఇద్దరు కలిసి సమానమైన ప్రీతితో మేము అర్పించే హవిస్సును స్వీకరించి,మమ్ములను అనుగ్రహిస్తారో అదేవిధముగా,
నేను చేయుచున్న దీపారాధన అను అగ్ని సేవనమునకు మీరిద్దరు సమానమైన ప్రీతితో వచ్చి నన్ను ఆశీర్వదించగలరు అంటూ తన్మయత్వముతోఎ ధ్యానములో మునిగిపోయాడు.
బాహ్యము భయావహకముగా అగ్నిని ప్రజ్వరిల్లచేయుచున్నది.కేశములు అగ్నిస్పర్శచే సంసార పాశములను విడదీయుచున్నవి.
ఆంతర్యము స్వామి చెంత అవధులులేని ఆనందాబ్ధిలో మునకలు వేయుచున్నది.
కన్నుల ఎదుట నిలబడినాడు మూడుకన్నులవాడు .
నాయనారుని తన కౌగిలి లోనికి తీసుకొని,
కైవల్యమును ప్రసాదించాడు.
నాయనారును అనుగ్రహించిన నందివాహనుడు మనలనందరిని అనిశము రక్షించును గాక.
ఏక బిల్వం శివార్పణం.
Comments
Post a Comment