KADAA TVAAM PASYAEYAM-25
కదా త్వాం పశ్యేయం-25
*********************
"జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం
నమామి భగవత్ పాదం శంకరం లోక శంకరం"
" వక్షస్తాడనమంతకస్య కఠినాపస్మార సం మర్దనం
భూభృత్ పరయటనం నమత్సుర శిర కోటీర సంఘర్షణం
కర్మేద మృదులస్య తావకపద ద్వంద్వస్య కింవ ఉచితం
మచ్చేతో మణిపాదుకా విహరనం శంభో సదానీంకురు."
శంభో! నీవు బాలమార్కందేయుని రక్షించుటకు నీ మృదు పాదముతో కఠినమైన యముని హృదయమున తన్నినావు.
అట్టి నీ మృదుపాదము నా అజ్ఞానమనే
కఠినత్వమును సైతము తొలగించమని ప్రార్థించుచున్నాను.అందులకు నీ పాదపద్మములు మరింత కందిపోకుండా,నా హృదయమనే మణిపాదుకలను స్వీకరించి,నన్ను అనుగ్రహించు తండ్రీ!
అని ప్రార్థించుచు,ఈనాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము.
పిల్లలతో పాటుగా శంకరయ్య సైతము, "
"అనుక్షణము శివనామమే అనుచు శివుని కానరే
ఘనుడు శంకరుడు మనలను కరుణ చూచి ఏలగా
నమః సోమాయ-శివాయ
నమః సోమాయ -శివాయ
నమో మహాదేవాయ"
అనుకుంటూ ఎంతదూరము నడిచారో వారికే తెలియదు.ఇతరుల గురించి ఆల్లోచనయే లేదు శంకరయ్యకు.తాను ఎవరితో ఎక్కడికి ఎందుకు వెళుతున్నాడో కూడా తెలియదు
.
ఇంతలో వారికి ఎదురుగా ఒక బోయవాడు తెగిన చెప్పును,పచ్చి మాంసపు ముక్కను చేతులలో పట్టుకుని,నోటినిండా నీటిని నింపుకుని వీరికి ఎదురైనాడు.అతనిని మరికొందరు అనుసరిస్తున్నారు.
ఓం నమః శివాయ.
ఉలిక్కిపడ్డాడు శంకరయ్య.వెనుకడుగు వేశారు పిల్లలు.విల్లు-బాణములు ధరించి యున్నాడు.
అతనసలు వీరిని పట్టించుకోకుండా తన వెనుక నున్న వారిని త్వరగా నడవమని సైగ చేస్తూ వెళుతున్నాడు.
చివరగా వెళుతున్న వ్యక్తిని కొంచము ఆగమని,ఎవరాయన? ఆ చెప్పు ఏమిటి? ఆ పచ్చిమాంసము ఏమిటి? నోటిలో నీరు ఎందుకు?
అని అడిగాడు.పిల్లలకు కొంచము ధైర్యము వచ్చింది వాళ్ళ గురువును చూడగానే.
" అతను ఉలకడు-పలకడు"
తిరిగి-తిరిగి ప్రశ్నిస్తే.
" మనసున మసలుమ సదాశివా
మాయాతీతా-మహాదేవా"
అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. .మరింత ఆసక్తి పెరిగింది శంకరయ్యకు.వారిని అనుసరించసాగాడు.
" మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే
గండూషాంబు నిషేచనా పురరిపోః దివ్యాభిషేకాయతే
కించిత్ భక్షిత మాంస శేష కబళం నవ్యోపహారాయతే
భక్తిః" కిం న కరోతి" అహో వనచరో! భక్తా వతంసాయతే"
అక్కడొక పెద్ద శివలింగము.దాని మీదనున్న దుమ్మును ఈ పెద్దమనిషి తాను తెచ్చిన పాతచెప్పుతో తుడుస్తున్నాడు.పుక్కిలించిన నీళ్లను పోసి అభిషేకమంటున్నాడు.ఆ పచ్చిమాంసపు ముక్కను తినమని అనగానే
" ఆశ్చర్యము" స్వామి తిని కొంచము ప్రసాదముగా మిగిల్చాడు.
" చీపురాయెను చెప్పు తాను చిమ్మెదననుచు
పుణ్యతీర్థమాయె పుక్కిలింతల జలము
మాంస శకలము మారె "మహానైవేద్యము"గ
చెప్పగలమ మనము "శివుని కరుణ."
స్వామి భక్తిని స్వీకరిస్తాడు కాని బాహ్యమును చూడడు.ఎంతటి అదృష్టవంతుడు ఈ వేటగాడు.
"
శివ శివ శంకర -భక్తవశంకర శంభో హరహర నమోనమో" అనుకుంటూ స్వామిని తడిమి-తడిమి చూసుకుంటున్నాడు.కొసరికొసరి తినిపిస్తున్నాడు.
మడి లేదు-పూజ లేదు
మంత్రము-లేదు-తంత్రము లేదు
యజ్ఞములేదు-శాస్త్రములేదు
నియమములేదు-నిర్బంధము లేదు.
ఆలయములేదు-ఆడంబరములేదు.
"ఉన్నది ఒక్కటే ఆర్తి" .స్వామి ఎట్లా ఎండకు-వానకు,ఇల్లు-వాకిలిలేక ఉన్నాడన్న ఆర్తి.నేను చూసుకోకపోతే పాపం ఎవరు చూసుకుంటారన్న ఆర్తి. ఆ ఆర్తి అనుగ్రహముతో భక్తిగా మారినది.భక్తి బంధమును వేసినది.బంధము భగవంతునికి బానిసను చేసినది.భగవంతుడు భక్తునికి దాసుడైనాడు.వారికి వీరు-వీరికి వారు త్వమేవాహం అయిపోతున్నారు.
ఆ వేటగాడు స్వామి కన్నును తడిమి తడిమిచూసుకుంటున్నాడు.కుశలమా! కుశలమా! అని పదే పదే అడుగుతున్నాడు.నిన్ను ఎవరైనా నొప్పిస్తే, నిన్ను సంరక్షించుకోవటానికి నేనున్నాను అంటున్నాడు. .ఎంతటి పరమాద్భుతము పరమేశ్వరుని అనుగ్రహము.
ఉడుమూరు గూడెము తిన్నని 'భక్త కన్నప్పను}ను చేసినది ఆ గాఢ/మూఢ భక్తియేకదా.
అక్కడివారికి మహేశ్వరు తమ వాడు/తమజాతివాడు.ఆదికిరాతకుడు.అర్జునునికి పాశుపతమును అందించిన వాడు.ఆ నమ్మకముతోనే అడవిలోపలి మృగములను మేము వేటాడగలము.కాని మా అంతరంగములో స్వైరవిహారము చేయుచున్న మృగములను వేటాడగల సమర్థుడవు నీవే అనుచు,
" మాగచ్ఛత్వమితస్తతో గిరిశ భో మయ్యేవ వాసంకురు
స్వామిన్ 'ఆదికిరాతక" మామకమనః కాంతార సీమాంతరే
వర్తంతేబహుశో మృగా మదజుషో మాత్సర్య మోహాదయ
స్త్వాన్ హత్వా మృగయావినోద రుచితా లాభం చే సంప్రాప్య సి"
మహదేవా !నీవు ఆదికిరాతకుడవు.నా హృదయము అరిషడ్వర్గములను కౄరమృగములు నిండిన మోహారణ్యము.నీవు కనుక నా హృదయములో స్థిరనివాసమునేర్పరుచుకుని వాటిని వేటాడావంటే నీకు వినోదము మాకు వాటి నుండి విముక్తి అని చమత్కారముగా చెప్పుతుంటే శంకరయ్య మదిలో ఏదో సందేహము.దాని నివృత్తికై సమీపిస్తున్నాడు ఆ నిశ్చలభక్తుని దగ్గరికి.
కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ.
'తన్మై మనః శివ సంకల్పమస్తు
వాచే మమశివపంచాక్షరస్తు
మనసే మమ శివభావాత్మ మస్తు".
పాహిమాం పరమేశ్వరా.
(ఏక బిల్వం శివార్పణం)
Comments
Post a Comment