TANOTU NAH SIVAH SIVAM-13@SIVATANDAVASTOTRAMU


. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ." మహాదేవుడు మన్మథ పంచబాణములను దహించివేసి వాని సౌశీల్య సౌందర్యమును అలంకారముగా మలచుకుని,తన విశాలఫాలభాగనందు అలంకరించుకుని "కామేశ్వరుడై" కన్నులపండుగ చేస్తున్నాడు. స్వామి లలాటము యజ్ఞవేదికగా ప్రజ్వలిస్తున్నదికదా.దానిని కొనసాగిస్తూ (చమకము) ర్త్విక్కులు,స్వామిని, ఇధ్మశ్చమే-బర్హిశ్చమే-వేదిశ్చమే-ధిష్టియాశ్చమే- అంటూ యజ్ఞ నిర్వణకై మా అందరికి సమిధలు-దర్భలు-ద్రోణకలశములు-సుక్కులు-స్రవములు మొదలగునవి సంవృద్ధిగా అందీయమని అర్థిస్తున్నారు. మరొకవైపు పామరజనులు పయశ్చమే-రసశ్చమే-ఘృతంచమే-మధుచమే అంటూ అభిషేకమునకు కావలిసిన పాలు-పండ్లరసములు-నేయి-తేనె మొదలగు వాటిని అర్థిస్తున్నారు. మరికొందరు తిలాశ్చమే-ముద్గాశ్చమే-గోధూమాశ్చమే అంటుండగా మరికొందరు కృష్ట పచ్యంచమే-అకృష్టపచ్యంచమే దున్నినదైనా లేక దున్ననిదైనా సరే భూమిని అడుగుతున్నారు. కొందరు పశువులను-మరికొందరు ,మరి కొందరు సంతతిని అభ్యర్థిస్తున్నారు. స్వామి తాను నేరుగా ప్రసాదించలేనని శక్తివైపు చూశాడట. ఆజగదంబ నిత్యాన్నదానేశ్వరి-నిత్యానందకరి. అంతేకాదు లీలా నాటక సూత్ర ఖేలనకరీ. కనుకనే దృశ్యాదృశ్య విభూతి పాలనకరి అయినప్పటికిని వాటిని చిత్రించి మురిసిపోయే వినోదమును తన స్వామికి అందించినది. స్వామిది సామాన్యకల్పనము కాదు-ప్రకృష్టమైన కల్పనమునకు శిల్పిని చేసి మురిసిపోతున్నది. స్వామి అమ్మ వారి కుచములనెడి పర్వతములపై చిత్రపత్రకములనుంచుతున్నాడు జగత్పితయై. సాధారణముగా శిల్పి శిలలోని అనవసర శేషములను తొలచివేసి అందమైన శిల్పమును మలుస్తాడు. ఈ ఏకైక శిల్పి విశ్వములోని తారకాసురమను అనవసరమును తీసివేసి విశ్వశాత శిల్పమును మలచుటకు ఉపక్రమించబోతున్నాడు.( కుమార సంభవమునకు నాంది అనుకొనవచ్చును) మహాదేవుడను మహాశిల్పి అమ్మ వక్షస్థలమను పర్వతభాగముపై కొన్ని అవశేషములను తీసివేస్తూ, క్షేత్రములు-తీర్థములు-అరణ్యములు=పొలములు-జలపాతములు-సూర్యుడు-చంద్రుడు-నదులు-సముద్రములు-గుట్టలు-లోయలు-అంటూ నైసర్గికస్వరూపమునకు రూపుదిద్దుతూ వాటి సమన్వయముతో సమృద్ధిగా సస్యములను అందిస్తున్నాడు. స్వామి అన్నానాం పతయే నమః-అమ్మ అన్నపూర్ణేశ్వర్యై నమః. రెండవ చరణములో "కిశోరచంద్రశేఖరే "రతి ప్రతిక్షణం మమ" అన్నా డు రావణుడు. మరింత అనుగ్రహము వర్షించిన తరువాత ప్రస్తుతము "రతి ప్రతిక్షణం" అంటున్నాడు.ఇప్పుడు కేవలము చంద్రశేఖరునిగా మాత్రమే కాదు. అగ్నినేత్ర దర్శనము తరువాత "త్రిలోచనుని" తో క్రీడించాలనుకుంటున్నాడు. సూర్య-చంద్ర-అగ్ని లోచనునితో మమేకమయి క్రీడించవలెనన్న దాటవలసిన స్థితులు ఎన్నో. ఆదిశంకరుల సౌందర్యలహరి స్తోత్రములో స్వామి స్థాణువు-అమ్మ చైతన్యము.శివతాందవ స్తోత్రములో అమ్మ స్థాణువు.స్వామిచైతన్యము.ఒకరికొకరు ఒద్దికగా స్థావర-జంగమాత్మకమగుటయే కదా అర్థనారీశ్వరము.అత్యంత మనోహరము. "ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాందవాయై జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయైచ నమః శివాయ." కదిలేది ప్రపంచము-కదలనిది పరమాత్మ భజ శివమేవ నిరంతరం ఏక బిల్వం శివార్పణం.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)