TIRUVEMBAVAY-16
తిరువెంబావాయ్-16
***************
కృపా సముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతీవామభాగం
సదాశివం రుద్రం అనంతరూపం
చిదంబరేశం హృది భావయామి"
సందర్భము
*********
సకలచరాచరములలో సర్వకాల సర్వావస్థలలోను శివనామస్మరణము తక్క అన్యము లేదను స్థితిలో నున్న తమ చెలిని ప్రస్తుత పాశురములో వానకురుస్తున్న విశేషములను,ఆ వాన సందర్భమున మెరుస్తున్న మెరుపులను,ఉరుముతున్న ఉరుములను,హరి విల్లును జగన్మాత సాకార రూపముగా దర్శిస్తూ,చెలిని మేల్కొలుపుచున్నారు.
పాశురము.
*********
మున్ ఇక్కడలి చురుక్కి ఎళందుడియాళ్
ఎన్న తిగలైదెమ్మ ఆరుడయాల్ ఇట్టడియన్
మిన్ని పొళందె ఎం పిరాట్టి తిరువడిమేల్
పొన్నం చిలంబర్ చిలంబర్ తిరుప్పురవం
ఎన్న శిలై కులవి నందమ్మై ఆరుడయాళ్
తన్నిల్ పిరవళా ఎణ్ కోమణ్ అంబర్క్
మున్ని అవళ్ నమక్కు మును శురుకు ఇన్నరుళే
ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ"
గోదమ్మ తిరుప్పావై నోములో "ఆళిమళై కన్నా" అంటూ వర్షప్రాశస్త్యమును మనకు అందిస్తే తిరు మాణిక్యవాచగరు
"మున్ ఇక్కడల్ పుక్కి" అంటూ వర్షస్వరూపమునకు-సుధాసారాభివర్షమునకు అన్వయిస్తున్నారు.సాకార-నిరాకార ఆరాధనముల మేలుకలయిక ప్రస్తుత పాశురము.మహాదేవుడు సూర్యభగవానునిగా సముద్రజలములలోనికి మునిగి,వాటిని ఆవిరిగా మార్చి,ఊర్థ్వ పయనమును చేయించుచున్నాడు.ఆ ఆవిరియైన జలము స్వామి యను మేఘమును-స్వామిని కూడియున్న జగదంబ అను మెరుపును శరణువేడి సుధలను వర్షించుచున్నది.ఆ వర్షము అమ్మ అవ్యాజ అనుగ్రహమను కాలియందల ధ్వనులను ఉరుములుగా ప్రకటిస్తూ ఉప్పొంగుచున్నది
జగదంబ "తటిల్లతా సమరుచి-షట్చక్రోపరి సంస్థితా" కనుక ఆ తటిల్లతా సౌందర్యమును కాసేపు వాన మెరుపులకు ప్రసాదించినది.
అంతే కాదు,శింజాన మణి మంజీరా" ఆ శుభంకర ధ్వనులను సైతము ఉరుముల మంగళ ధ్వనులుగా అనుగ్రహించినది.
ఆమె కనుబొమ్మల సౌకుమార్య-సౌందర్యమును వానవిల్లుగా దర్శింప చేసినది.
వర్షము అంత సౌభాగ్యమునకు నోచుకొనుటకు కారణము ఏమై ఉంటుంది.ఆ వర్షము దేనికి సంకేతముగా మనకు హర్షమును అందించుచున్నది అని ఆలోచిస్తే,
కార్మిక-మాయ-ఆర్ణవ
మలములను కలిగియున్న జీవుడే ఆ ఉప్పు అను గుణమునుతో నున్న జలమనెడి జీవుడు.వాని యొక్క మలప్రక్షాళనము జరుగవలెనంటే అవి ఆవిరి అయి జీవుడు తేలిక పడవలసినదే.
ఆ ప్రరియ యే స్వామి అనుగ్రహమనెడి సూర్యరశ్మి కడలిలో తాను ముందు మునిగి జీవుని ఊర్థ్వ పయనమునకు సహాయపడుట.ఒక విధముగా సహస్రార పయనము అనుకోవచ్చును లేదా సత్వమార్గ పయనము కూడా కావచ్చును.తెల్లని మేఘము సదాశివుడు.ఆ మేఘమునంటి యున్నది సాక్షాత్ పరమేశ్వరి.
మెరుపు-మేఘముగా ప్రకాశిస్తూ మనలను అనుగ్రహిస్తున్న వారి సేవనమునకు బహిర్ముఖము కమ్మని చెలిని వేడుకొనుచున్నారు.
అంబే శివే దివ్య తిరువడిగళ పోట్రి.
ఏక బిల్వం శివార్పణం.


Comments
Post a Comment