TIRUPALLIELUCHCHI-08
ముందియ ముదల్నడు ఇరుదియం ఆణా
మువ్వరం అరికిలాల్ యవర్మట్రు అరివార్
పందణై విరళియుం నీయుం, నిన్ అడియార్
పలంకుడి తొరుం ఎళుయుం అరుళియ పరనే
శెందడల్ పురైతిరు మేనియుం కాట్టి
తిరుపెరుం తురైయురై కోయిలుం కాట్టి
అందణన్ ఆవదుం కాట్టి వందండాయ్
ఆరముదయె పళ్ళి ఎళుందరుళాయె.
.....
"యత్ త్రికాలే అపి తిష్ఠతి తత్ సత్."
ఏదిసర్వకాల సర్వావస్థలందును స్వయం ప్రకటితమో అదియే సత్తు.
దాని ప్రకశనమే చిత్తు.
ఉన్నదాని ఉనికిని తెలిసికొనుట సత్చిత్.
తెలుసుకొనుటవలన లభించు దివ్య అనుభూతియే అలౌకికానందము.అదియే
"సచ్చిదానందము."
ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు చెలుల సంభాషణ
ము ద్వారా మనకు ఆ దివ్యమైన అనుభూతిని,
ఆరముదయె-మధురాతిమధురమైన మకరందమా అని సంబోధింపచేస్తున్నారు.
ఆ మందార మకరందమును ఆస్వాదింపగలిగే మధుపముగా మన మనసు మారాలంటే మన ఇంద్రియములు స్వామి అనుగ్రహపాత్రములై ఉండాలి.
మన కర్మలు స్వామి యొక్క నిజతత్త్వమును,తెలుసుకొనగలగాలి.
మున్ముదల్ ఆణాయ్-ప్రపంచ సృష్టికి ముందున్నది
ముదల్ ఆణాయ్-సృష్టి ప్రారంభమునందున్నది
నడు ఆణాయ్-మధ్యమ స్థితిలో నుండునది
ఇరుదియం ఆణాయ్-ప్రళయమునందుండునదియును అనగా
స్వతంత్ర ప్రకటనముకల నిత్య సత్యముగా మనము గుర్తించగల వారలమై యుండాలి.
అంతే కాదు మన నయనములు సైతము,
శెన్-ఎర్రని
తడల్-అగ్ని స్వరూపముగా
తిరుమేనియుం-అగ్నిస్వరూపముగా/అరుణగిరిగా
మమ్మేలుతున్నది నీవే (స్వామి)
పరమాత్మనే
తిరుపెరుంతూరులోని ఆత్మనాథునిగా మమ్ములను అనుగ్రహించుచున్నావు.
అంటే నువ్వు నిత్యము.అంతేకాదు,
నీవు సత్యము
కూడా.
నీ రూపములు-కాలములు-నామములు-నటనములు ఇవి అని చెప్పనలవికాదు..
కాని నీ కరుణావిశేషములను కీర్తించుటకు మాకు అనేకానేక నిదర్శనములు కలవు.
మువ్వరు అరికిలార్-బ్రహ్మవిష్ణు రుద్రాదులతో పాటుగా
యామట్రు అరివార్-ఎందరో దేవతలు నీ యొక్క స్వరూపమును-సత్కృపను కనుగొనలేకపోయినప్పటికిని,
పందణైవిరళియుం-నీయుం
పూబంతి పార్వతీదేవిని కూడి నీవు
నిన్ అడియార్-నీ పాదసేవకులయొక్క
హృదయములందు కొలువై ప్రకాశిస్తున్నావు.
ఆ దివ్యమంఘళ సాక్షాత్కారమునకు నీవు వారినుండి
పణం-సంపదలను
పుహళ్- ఆడంబరములు ఆశించలేదు.
వారి నిష్కళంక నిశ్చలభక్తియే వారిపై నీ ఆశీ
ర్వచనమును అందించినదనుటకు ఆ పూసలర్ నాయనారు నిర్మించిన మనోమందిరమునందు నీవు అధిష్ఠించలేదా.
" యుక్తేనా చేతసా నాన్యగామినా
పరమం పురుషం దివ్యయతి." అనుచు,
చెలులు చిదానందములో మునకలు వేస్తూ,తనతోటివారికి కూడా ఆ బ్రహ్మానందమును అందచేయదలచి,
ఓ చేతనా!
నీ మనమును అన్యవిషయములవైపునకు పోనీయక,సాధన అను కర్మయందు నియంత్రించి,పరమజ్ఞానమయమయిన ఆత్మతత్త్వమునందు సదా సంచరించు/సంతసించు అనుచు శివనోమునకు సన్నధ్ధులగుచున్నారు.
*****
ఈ రోజు మాణిక్యవాచగరు జీవితములో జరిగిన విశేషములతోపాటుగా,"అవనీమూలం" రోజు ప్రత్యేకతగురించి తెలుసుకుందాము.
శ్రావణ -భాద్రపద మాసములలో వచ్చే మూలా నక్షత్ర తిథిని తమిళ సంప్రదాయానుసారులు పరమ పవిత్రముగా భావిస్తారు.భూమిపూజచేసి,విత్తులు నాటు సంప్రదాయమును అనుసరిస్తారు.
స్వామి ఎవరి హృదయములో ఏ విత్తును నాటనున్నాడో కదా!
రాజభటులు మాణీక్యవాచగరు సమాధానము కొరకు పక్కనే నిలబడియున్నారు.చెక్కుచెదరని విశ్వాసముతో ముక్కంటి పాదములను వీడక వేడుకుంటున్నాడు తక్షణ కర్తవ్యమునకై.
క్షిప్రప్రసాదుడైన సోమసుందరుడు మాణిక్యవాచగరునకు కర్తవ్యమును తెలియచేసి,కానకున్నాడు.
మాణిక్యవాచగరు ప్రభువునకు
" అవనీమూల నక్షత్రము " నాటికి మన ఆశ్వములు మన రాజ్యమును చేరునని చెప్పి నిశ్చిం
తగా,నిర్మల మనముతో నిటలాక్షుని సేవిస్తున్నాడు.
ముందురోజు వరకు గుఱ్ఱములజాడలేదు.కబురును లేదు.పనితీరును మెచ్చని రాజు మాణిక్యవాచగరును కారాగారములో బంధించుటకు ఆజ్ఞాపించెను.
కాఠిన్యమును తోసివేస్తూ కారుణ్యము కదలాలికదా.
బయలుదేరాడు భక్తునికి పరీక్షలు మరింత భారముచేస్తూ,
అనుకున్న ప్రకారముగా అడవినక్కలను గుఱ్రములుగా
మార్చి,తానొక అశ్వ సంరక్షకునిగా
అవతరించి,పాండ్యరాజు వద్దకు వచ్చి,వాటి ఔన్నత్యమును వివరించి,తిరిగి వెళ్లిపోయాడు.
ఆనందించుచున్న రాజుగారి ముఖములో అంతలోనే రంగులుమారినవి.క్రోధావేశములతో ఊగిపోతున్నాడు.
దానికి కారణమును
గురించి,రేపు తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.
అంబే శివే తిరువడిగళే శరణం.


Comments
Post a Comment