MARGALI MALAI-13

  మార్గళి మాలై-13
  ***************


  పదమూడవ పాశురం
  ****************
 పుళ్ళిన్వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
 క్కిళ్ళు క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్
 పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
 వెళ్ళి ఎళుందు వియాళం ఉరంగిత్తు
 పుళ్ళుం శిలుంబినకాణ్! పోదు అరికణ్ణినాయ్!
 కుళ్లక్కుళిర క్కుడైందు నీరాడాదే
 పళ్ళికిడత్తియో? పావాయ్! నీ నన్నాళాల్
 కళ్ళం తవిరందు కలందు ఏలోరెంబావాయ్.

  తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో
 **************************.


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీ గోదారంగనాథుల అనుగ్రహము అనవరతము


 భగవత్ సత్సంగము నిన్నుబంధించి వేసినదా?
 బాహ్య స్మృతిని మరచి నీవు బదులీయ కున్నావు

 రేచుక్క జారినది-పగటిచుక్క చేరినది
 మార్గళి స్నానముచేసి, నోము నోచుకుందాము

 బకుని నోరు చీల్చినాడు బాలుడొకడు నేడనుచు
 మెచ్చుకొనుచు నోముస్థలికి వెళ్ళినారు గోపికలు


 ఏకాంతమును వీడి శ్రీకాంతుని సేవింపగ,మేలుకో
 తరలి వచ్చినది తల్లి తానొక  గోపికయై


 పాశురములు పాడుచు,పాశములన్నిటిని వదిలి
 నప్పిన్నాయ్ తిరుప్పావై కు రారాదో?ఓ మృగాక్షి.!


 ఈ పాశురములో గోదమ్మ " నీ నన్నానాళ్" అని ధనుర్మాస ప్రాశస్త్యమును మరొక్కసారి మనలకు గుర్తుచేస్తున్నది.భగవద్గుణామృత స్నానమునకు సమయమిది అని లోపలి గోపికకు చెబుతున్నది.దానికి గుర్తులను ప్రస్తావించుచున్నది.

 మొదటి గుర్తు అసురత్వము అంతరించినది అంటూ,బకాసురుని స్వభావమును -దాని పరిణామములను తెలియచేస్తున్నది.బాహ్య సుందరత్వముతో-భావ మాలిన్యముతో తెల్లని కొంగ రూపమును ధరించి,ఖదిర వనమును సమీపించినాడు ఈ కొంగరూపి యైన రాక్షసుడు.అదే రక్షించుట అను గుణమును మచ్చునకైన లేని వాడు.కొంగ జపమును చేస్తున్నాడు.

పెద్దలు ఈ కొంగజపమును అనుకూలముగాను-ప్రతి కూలముగాను విశ్లేషించి యున్నారు.తాను దేనిని పొందదలచినదో (ఆహారముగా) ఆ ఎర లభించువరకు వేచిచూసి దానిని మాత్రమే కబళించు స్వభావము కలది.సద్విషయముల పట్ల ఇది అనుసరణీయమే.

కాని ఇక్కడి కొంగ చేయున్న తపము-దానికున్న తపన అటువంటిది కాదు,దాని మూర్ఖత్వము బాలకృష్ణుని మింగదలచినది.ఇతర గోపబాలురు వస్తున్నారు.దానిని చూస్తున్నారు.కాని అది మాత్రము స్థిరముగా తన ఎర కొరకు ఎదురుచూస్తున్నది.జిహ్వేంద్రియమును సంస్కరించాలనుకున్నాడు స్వామి.దాని నోటిలోనికి దూరి,దానిని సంస్కరించి,మింగబోవు దాని మూర్ఖత్వమును రెండుగా చీల్చివేసి,  కంసబంధము నుండి విముక్తిని ప్రసాదించాడు పురుషోత్తముడు.గోపబాలకులు దాని ఈకలను తోరణములుగా చేసుకొని గోకులమున ద్వారములకు కట్టి అసురత్వము సమీపించిన దాని అవసాన దశను తెలియచేసారట.


 అరక్కనై అని అమ్మచెప్పిన రాక్షసస్వభావమును ఆచార్యులు జన్మ సంక్రమణము-కర్మ సంక్రమణముగా గుర్తించి,జన్మతః అసురకులమున నున్నప్పటికిని,తమ సత్కర్మల ద్వారా సన్నుతులు పొందిన వారిగా విభీషణుని,ప్రహ్లాదుని,త్రిజటను ఉదహరిస్తారు.


 రెండవ గుర్తుగా గురుడు అను రాత్రి చుక్క "వియుళుం ఉరంగిత్తు" అస్తమించినది.చీకటిని తొలగిస్తూ,"వెళ్ళి ఎళుందు" వెలుతురు ఉదయించినది అని చెప్పినది.ఎమిటా చీకటి? నాస్తికత్వమను చారువాక మతమును (గురునిగా) తొలగిపోయిన చీకటి తో పోల్చినది.మృతసంజీవని మంత్ర దాత అయిన శుక్రుని వెలుతురుతో పోలుస్తూ,గ్రహగమనములను,వాటి ఫలితములను గోపికరూపియైన గోదమ్మ చెప్పు చున్నది.అయినను లోపల భగవదనుభవములోనున్న "పోదు అరి కణ్ణనాయ్" బదులీయలేదు.

 పద్మముల వంటి జ్ఞానసూచకములైన కన్నులు కలది.లేడి వంటి చలాకి కన్నులు కలది.తుమ్మెదల వంటి మధువును గ్రోలు కన్నులు కలది.తన నేత్ర విశేషముచే భూమానందమును పొందుచున్న భాగ్యశాలి.ఏమా భూమానందము.?

.దీనిని అనుభవిస్తున్నంత సేపు ఏ ఇతర విషయాసక్తతను పొందించ లేనిది

,"మూలతత్త్వ పరమార్థమును సమూలముగా అర్థముచేసుకొని,దానినే ఆశ్రయించి,ఆస్వాదించునది.అదియే బ్రహ్మానందము".దానిని తమకును పంచమనుటయే"కుళ్ల కుళిర క్కుడైందు నీరాడాదే? అను సంకేతము.(శ్రీ మాన్ తిరుప్పాణి ఆళ్వార్ ముని వాహనునిగాభావిస్తారు.)


కాని ఇక్కడను గోదమ్మ ఆచార్య మర్యాదను అతిక్రమించిన శిష్యురాలిగా(కళ్లం తవిరందు కలందు) ఈ గోపికను గుర్తించి,తన నిదుర వీడుటకు ,పదిమందికి పరమాత్మ తత్త్వమును  పంచుటకుఎవరి పధ్ధతి ఆదర్శవంతమో కీర్తిస్తూ మనకు మతంగ ముని ఆశ్రమములో నున్న శబరి ఉదాత్తతను ఉదహరించినది గోదమ్మ.

.ఇన్నాళ్ళు నేను శ్రీరామ దర్శనార్థము వేచియున్నాను,పండు ముసలినైపోయాను  కనుక పండ్లు తినిన తరువాత స్వామి నా దగ్గరనే ఉండాలి."నేనే "శ్రీరామ సామీప్యానుభూతితో నుండాలి అని అనుకోలేదు.దర్శించినది.పళ్లను సమర్పించినది.జగత్కళ్యాణ  రాముని సందర్శన-సామీప్య భాగ్యమును అందరికి అందించవలెనను   భావముతో స్వామికి వీడ్కోలు పలికినది.అదేవిధముగా ఓ పద్మనేత్రి!,నీ దివ్యానుభవములను పదిమందికి పంచుటకు మేల్కాంచు అని,ఆ గోపికను తీసుకొని గోష్టికి వేరొక గోపికను మేల్కొలుపుటకు గోదమ్మ తరలుచున్నది.

 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)











Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)