ఓం నమో నారాయణాయ-26



"శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే"
ఓం నమో నారాయణాయ-26
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
చెంతనున్న స్వామిసేవ చెదరని వ్యామోహమైన
దాచలేని గోపికల "మాలే" అను పిలుపులో
గాయకులు- శంఖములు మేలుకట్లు కోరుకున్న వారైన
అర్థులు-దాతలు ఒక్కరైన అద్వైత భావములో
పదునాలుగు భువనముల స్థూలము సూక్ష్మముయైన
పదిలముగా పరుండిన వటపత్ర శాయిలో
పరాత్పరుని కోరుతూ " పరను" వద్దన్నవారైన
నల్లనయ్య సన్నిధిలో పాడుతున్న" పల్లాండ్లలో"
సారసాక్షుని సన్నిహితపు సాహచర్యమునకు రారె
ఆముక్త మాల్యద ఆండాళ్ అమ్మవెంట నేడె.
భావము
వ్యాపించిన మోహములో మునిగిన గోపికలు శ్రీ కృష్ణుని దాసోహభావముతో మాలే!(వీడలేని వ్యామోహమా!) అని సంభోదిస్తూ,వటపత్రశాయిగా (శయనించేస్వామి-శాయి) స్వామిని దర్శించుచు,వారికి శంఖములు-భాగవతులు-మేలుకట్లు,( చతురస్త్రాకారము వస్త్రముతో కప్పబడిన గొడుగుల వంటివి) కానుకలుగా కావాలంటు కాసేపు అంతలోనే కానుకలు వద్దు -కన్నయ్యతో సాన్నిహిత్యము కావాలంటు విష్ణుచిత్తులవారు స్వామికి స్వామిని ప్రస్తుతించినవైన మంగళాశాసనమైన పల్లాండ్లను పాడుచున్న గోపికలను దర్శించిన మన గోపిక
వారి మనోభావములను అర్థము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది.
ప్రళయ సమయములో ప్రపంచమంతయు మునిగిపోయినను(స్వామి ఉదరములో దాగినను)మార్కండేయ మహాముని చెక్కుచెదరక (చిరంజీవికదా) పుణ్యఫలముగా వటపత్రశాయిని దర్శించగలిగినాడట.స్వామి ప్రత్యక్షమై వరము కోరుకోమనగానే పులకితుడై కృష్ణమాయలో లేశమును తాను అనుభవించే భాగ్యమును కలిగించ మన్నాడట.వెంటనే స్వామిదయతో జలములోనికి వెళ్ళినాడట
చూసిన అక్కడ ఏమీ కనీసము స్వామికూడా మునికి కనిపించలేదట.చింతాక్రాంతుడైన మునిని కరుణించి స్వామి పున:దర్శన భాగ్యమును కలిగించాటడ.మన గోపికకు, గోపికలలో మార్కండేయ మహాముని తత్వచింతనయే తలపునకు వచ్చింది.
" కరార విందేన పదారవిందం
ముఖార విందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటెశయనం
బాలం ముకుందం మనసా స్మరామి"-బాల ముకుందాష్టకం (లీలా శుకులు)
అమృతమును వదిలి యోగులు నా పాదపద్మముల మకరందమును ఎందుకు కోరుకుంటున్నారు అని చిన్ని కృష్ణుడు లేత పద్మము వంటి తన చిన్ని కాలి బొటనవేలుని.లేత పద్మములవంటి తన చేతులతో పట్టుకుని,ఎర్రని లేత పద్మమువంటి తన నోటిలో పెట్టుకుని తాదాత్మ్యమునందుచున్నాడు. స్వామి! నమో నమ:
ప్రపంచము పరిణామ స్వభావము కలదికాని పరిసమాప్తి స్వభావము కలదికాదు.స్వామికి-మర్రి చెట్టుకు గల సారూప్యము ఏమిటి? మర్రి విత్తనం సూక్ష్మము-చెట్టు స్థూలము.తిరిగి సూక్ష్మము-పెరిగి స్థూలము.పున: పున:.ఇదే స్వామి వట పత్ర శయన రహస్యము.స్థూల లోకములన్నీ సూక్ష్మమై ప్రళయ కాలమున స్వామి ఉదరములో దాగియుండుట-తిరిగి ప్రళయానంతరము స్థూలముగా స్వామిచే ప్రకటింప బడుట అను విశేష స్వరూపమును దర్శించుచున్న గోపికపై నిమగ్నమైన నా మనసు అమ్మవెంట నడచుచున్న గోపికలతోపాటు తన అడుగులను కదుపుతోంది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)